Latest News

మల్కాజిగిరి విన్నర్ జేపీయేనా?

posted on: Apr 29, 2014 5:30PM

 

 

 

మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఎలాగూ కనిపించడం లేదు. వైఎస్సార్సీపీ అభ్యర్థి గెలుస్తాడన్న అనుమానం ఎవరికీ లేదు. ఇక్కడ బీజేపీ బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థిగా మల్లారెడ్డి పోటీలో వున్నారు. అలాగే లోక్‌సత్తా అభ్యర్థిగా జయప్రకాష్ నారాయణ రంగంలో నిలిచారు. బీజేపీ-తెలుగుదేశం మధ్య ఎన్నికల పొత్తు ఉన్నప్పటికీ, మల్కాజిగిరి స్థానంలో తెలుగుదేశం అభ్యర్థి కంటే జయ ప్రకాష్ నారాయణే గెలిస్తే బాగుంటుందన్న అభిప్రాయంలో బీజేపీ నాయకత్వం వున్నట్టు తెలుస్తోంది.

 

జయప్రకాష్ నారాయణ బీజేపీకి చాలా సన్నిహితంగా వుంటున్న వ్యక్తి. రాష్ట్ర విభజన అంశానికి సంబంధించి బీజేపీ కేంద్ర నాయకత్వానికి పూర్తిస్థాయి లెక్కలు సమర్పించిన వ్యక్తి ఆయనే. ఐఏఎస్ చదువుకున్న ఇటువంటి వ్యక్తి పార్లమెంట్‌లోకి ప్రవేశించడం మంచిదన్న అభిప్రాయంలో బీజేపీ వుంది. జేపీ పార్లమెంటుకు ఎన్నికైతే మోడీ నాయకత్వంలోని ప్రభుత్వంలో ఆయనకు మంత్రి పదవి కూడా ఆఫర్ చేయాలన్న ఆలోచనలో వున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. దీనితోపాటు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి బండారు దత్తాత్రేయకు జేపీ ప్రచారం చేశారు. ఈ కృతజ్ఞత కూడా బీజేపీ నాయకత్వానికి వుంది.



ఈ నేపథ్యంలో టీడీపీతో పొత్తు ఎలా వున్నప్పటికీ, మల్కాజిగిరి పార్లమెంట్ స్థానంలో జేపీకే మద్దతు ఇచ్చి, తమ ఓట్లన్నీ టీడీపీ అభ్యర్థికి కాకుండా జేపీకే పడేలా చూడాలనే సమాచారం బీజేపీలో అంతర్గతంగా వ్యాపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా అయితే, కాంగ్రెస్ వ్యతిరేక ఓటు, తెలుగుదేశంలో మల్లారెడ్డిని వ్యతిరేకించే వారి ఓట్లు, సీమాంధ్రుల ఓట్లు, జేపీని ఇష్టపడే విద్యావంతుల ఓట్లు.. బీజేపీ మద్దతుతో లభించే ఓట్లతో మల్కాజిగిరి నియోజకవర్గంలో జేపీ గెలిచే అవకాశాలున్నట్టు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...