ఐపీఎల్ ఫైనల్లో ఘోర తప్పిదం.. ఆశిష్ నెహ్రాపై జోస్ బట్లర్ సంచలన వ్యాఖ్యలు!

posted on: Jun 4, 2026 11:07AM

ఐపీఎల్ 2026 సీజన్ ఫైనల్ మ్యాచ్ ముగిసినా, గుజరాత్ టైటాన్స్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయంపై క్రికెట్ ప్రపంచంలో ఇంకా చర్చ నడుస్తూనే ఉంది. గత రెండేళ్లుగా గుజరాత్ టైటాన్స్ టాపార్డర్ అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతోంది. ఐపీఎల్ 2025 సీజన్‌లో గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్ కేవలం 15 మ్యాచ్‌ల్లో 759 పరుగులు సాధించి అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. అదే జోరును కొనసాగిస్తూ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ సైతం గత సీజన్ 15 మ్యాచ్‌లలో కలిపి 650 పరుగులు రాబట్టి సత్తా చాటాడు. ఇక వీరికి తోడుగా వన్‌డౌన్ బ్యాటర్‌గా రంగంలోకి దిగిన ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జోస్ బట్లర్ 14 మ్యాచ్‌లు ఆడి 538 పరుగులతో అదరగొట్టాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో కూడా ఈ ముగ్గురు పరుగుల వరద పారించారు. గిల్ 732 పరుగులు, సాయి సుదర్శన్ 722 పరుగులతో దుమ్మురేపగా, బట్లర్ 526 పరుగులతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.  అయితే, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరిగిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ మేనేజ్‌మెంట్ తీసుకున్న ఒక అనూహ్య నిర్ణయం అందరినీ షాక్‌కు గురిచేసింది. నిలకడగా రాణిస్తున్న జోస్ బట్లర్‌ను వన్‌డౌన్‌లో కాకుండా, నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు పంపాలని గుజరాత్ థింక్ ట్యాంక్ భావించింది. మ్యాచ్ ప్రారంభంలో జోష్ హేజిల్‌వుడ్ వేసిన మూడో ఓవర్లోనే కెప్టెన్ శుబ్‌మన్ గిల్ కేవలం 10 పరుగులకే అవుట్ అయ్యాడు. ఆ వెంటనే నాలుగో ఓవర్లో భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో సాయి సుదర్శన్ కూడా 12 పరుగులకే వెనుదిరిగాడు. గిల్ అవుట్ అవ్వగానే సాధారణంగా వన్‌డౌన్ పొజిషన్‌లో రావాల్సిన జోస్ బట్లర్ స్థానంలో అన్‌క్యాప్డ్ యంగ్ ప్లేయర్ నిశాంత్ సింధును బ్యాటింగ్‌కు పంపించారు.  ఈ ప్రయోగం పూర్తిగా విఫలమైంది. ఒత్తిడిలో బరిలోకి దిగిన నిశాంత్ సింధు 18 బంతుల్లో కేవలం 20 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత నాలుగో స్థానంలో వచ్చిన జోస్ బట్లర్ సైతం ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేక 19 పరుగులకే నిష్క్రమించాడు. టాపార్డర్ కుప్పకూలడంతో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 155 పరుగులకే పరిమితమైంది. అనంతరం 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ, విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ (నాటౌట్ 75 పరుగులు) సాయంతో 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. గుజరాత్ రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.  ఈ ఘోర పరాజయం తర్వాత బట్లర్ బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చడంపై క్రికెట్ దిగ్గజాలైన ఏబీ డివిలియర్స్, స్టువర్ట్ బ్రాడ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై జోస్ బట్లర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ అసలు ఆ రోజు ఏం జరిగిందో బయటపెట్టాడు.  తొలి వికెట్ పడగానే నేను బ్యాటింగ్‌కు వెళ్లేందుకు హెల్మెట్ పెట్టుకుని పూర్తిగా సిద్ధమయ్యాను. కానీ ఇంతలో హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా నా దగ్గరకు వచ్చి.. నువ్వు ఇక్కడే కూర్చో.. వన్‌డౌన్‌లో మేము నిశాంత్‌ను పంపాలని నిర్ణయించుకున్నాము అని చెప్పాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత నేను నెహ్రాను దీనిపై వివరణ అడిగాను. టాపార్డర్‌లో ఆడేందుకు యువ ఆటగాడైన నిశాంత్‌కు ఇదే మంచి అవకాశం అని, అతడిని ఏడో స్థానంలో పంపలేము కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నెహ్రా చెప్పాడు. గతంలో కోల్‌కతా మ్యాచ్‌లో ఈ వ్యూహం వర్కౌట్ అయినా, ఫైనల్ లాంటి పెద్ద మ్యాచ్‌లో మాత్రం మా ఆశలు తలకిందులయ్యాయి  అని బట్లర్ వాపోయాడు. నెహ్రా తీసుకున్న ఆ ఒక్క రక్షణాత్మక నిర్ణయమే చివరకు గుజరాత్ టైటాన్స్ టైటిల్ కలని దూరం చేసింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...