Latest News

కాంగ్రెస్ లో కొనసాగేందుకు జీవన్ రెడ్డి ససేమిరా?

posted on: Mar 24, 2026 12:06PM

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి బుజ్జగింపులకు లొంగలేదు. తాను పార్టీకి రాజీనామా చేయాలన్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు కుండబద్దలు కొట్టినట్లు తెగేసి చెప్పారు. పార్టీని వీడతానని ప్రకటించిన జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు  అధిష్ఠానం ఆదేశాల మేరకు టీపీసీసీ చీఫ్ మహేశ్‌ కుమార్ గౌడ్‌,  ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌లు జీవన్ రెడ్డితో మంగళవారం (మార్చి 24) ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా జీవన్ రెడ్డితో వీరు దాదాపు గంట సేపు చర్చించారు. పార్టీ వీడాలన్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కోరారు. అయితే అందుకు ససేమిరా అన్న జీవన్ రెడ్డి వారికి  పార్టీలో తానూ ఎదుర్కొన్న ఇబ్బందులు, తన అసంతృప్తికి కారణాలను వివరించినట్లు సమాచారం.  జిల్లా రాజకీయాల్లో తన సీనియారిటీకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత, గౌరవంపై పార్టీలో తనకు దక్కలేదని ఈ సందర్భంగా జీవన్ రెడ్డి టీపీసీసీ చీఫ్ కు వివరించినట్లు చెప్పారు.  

ఈ సందర్భంగా జీవన్ రెడ్డి పేర్కొన్న అన్ని విషయాలనూ పార్టీ హైకమాండ్ కు తెలియజేస్తామని ఈ సందర్భంగా వారు హామీ ఇచ్చినట్లు తెలిసింది. జీవన్ రెడ్డి వంటి సీనియర్ నేతల అవసరం కాంగ్రెస్ కు ఉందనీ,  ఆయన అభ్యంతరాలను  దిల్లీలోని కాంగ్రెస్ పెద్దల దృష్టికి తీసుకెళ్తానని, సమస్యలన్నీ పరిష్కరిస్తామనీ చెప్పారు.

అయితే జీవన్ రెడ్డి మాత్రం వారి బుజ్జగింపులను ఖాతరు చేయలేదనీ, ముందుగా ప్రకటించినట్లు బుధవారం (మార్చి 25) పార్టీకి రాజీనామా చేస్తున్నానని విస్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. ఈ బుజ్జగింపుల నేపథ్యంలో జీవన్ రెడ్డి రేపు ప్రెస్ మీట్ లో రాజీనామా ప్రకటన చేయనున్నట్లు వారికి స్పష్టం చేసినట్లు తెలియవచ్చింది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...