నా లాంటోడు రాజకీయాల్లో వెస్ట్

posted on: Sep 21, 2017 3:17PM

ఎవరు ఏమనుకున్నా..ఎంతగా విమర్శించినా మనసులో మాటను ఉన్నది ఉన్నట్లు మొహమాటం లేకుండా చెప్తారు టీడీపీ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు జేసీ..తాజాగా ఆయన మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.. అందుకు కారణం కూడా చెప్పారు..లోక్‌సభ సభ్యుడిగా తాను ఫెయిల్ అయ్యానని తన మనస్సాక్షి చెబుతోందని అన్నారు. తాడిపత్రి నియోజకవర్గంలోని చాగల్లు రిజర్వాయర్‌కు నీరు కూడా తీసుకురాలేని తనకు ఎంపీ పదవి ఎందుకని ప్రశ్నించారు.

 

ప్రజలకు హామీలు ఇచ్చి..వాటిని నెరవేర్చడంలో విఫలమైనందుకే రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చానని చెప్పారు. సోమవారం లేదా మంగళవారం ఢిల్లీకి వెళ్లి, లోక్‌సభ స్పీకర్‌కు రాజీనామా లేఖను అందిస్తానని చెప్పారు. అయితే తాను ఎంపీ పదవికి మాత్రమే రాజీనామా చేస్తున్నానని..టీడీపీకి కాదని జేసీ తెలిపారు..సీఎం చంద్రబాబు నాయకత్వంలోనే తాను భవిష్యత్తులోనూ పనిచేస్తానని చెప్పారు. ఆయన వెర్షన్ ఇలా ఉంటే.. అధిష్టానంతో ఎక్కడ చెడినందువల్లే జేసీ ఈ నిర్ణయం తీసుకున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ముఖ్యంగా అనంత అభివృద్ధికి కొన్ని శక్తులు అడ్డు తగులుతున్నాయని జేసీ చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే దివాకర్ రెడ్డి రాజీనామాపై టీడీపీ అధినేత స్పందించాల్సి ఉంది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...