బొద్దింకలకు ఆహారం అందించిన రెస్టారెంట్ల యాజమాన్యాలకు విచారణల పేరిట పోలీసు వేధింపులు.!

posted on: Aug 4, 2026 4:06PM

జంతర్ మంతర్ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళన సమయంలో నిరసన కారులకు ఆహారం అందించిన హోటళ్లు, రెస్టారెంట్లపై పోలీసులు చర్యలు తీసుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ విషయం ఇప్పుడు  దేశ వ్యాప్త చర్చకు తెరలేపింది. నీట్ లీకేజీకి వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ   నాయకత్వంలో యువత చేపట్టిన నిరసన  36 రోజుల పాటు నిరశన దీక్షలు, ధర్ణాలతో కొనసాగింది. ఈ   పోరాట ఫలితంగా జూలై 25న కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు.

విద్యార్థి లోకం సాధించిన ఈ విజయం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే..  ఆ తర్వాత ఢిల్లీ పోలీసులు తీసుకుంటున్న చర్యలు ఇప్పుడు వ్యాపార వర్గాల్లో, సామాజిక వర్గాల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. నిరసన ప్రాంగణంలో లభ్యమైన ఖాళీ ఫుడ్ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్ల ఆధారంగా పోలీసులు స్థానిక రెస్టారెంట్లు, కేఫ్ యజమానులను విచారణ పేరిట వేధింపులకు గురి చేస్తున్నారు. 

జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న యువతకు ఉచితంగా లేదా ఎక్కువ పరిమాణంలో ఆహారం, మంచినీళ్లు అందించారనే కారణంతో పలు ప్రముఖ ఆహార సంస్థల యజమానులను పోలీసులు విచారణల పేరిట వేధిస్తూ వారిపై  ఒత్తిడి తీసుకువస్తున్నారు.   జూలై 20వ తేదీన జరిగిన చలో సంసద్ ర్యాలీ సందర్భంగా పోలీసులు లాఠీఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించినప్పుడు..  ప్రాణభయంతో పరుగులు తీసిన విద్యార్థులకు జన్ పత్ లోని 'బ్లూ తోకాయ్ కేఫ్ ఆశ్రయం కల్పించింది. వారికి ఉచితంగా తాగడానికి నీరు, ప్రథమ చికిత్స అందించింది.

అదేవిధంగా లోధి కాలనీకి చెందిన  గర్నిటాస్,  మెహర్‌చంద్ మార్కెట్‌ లోని  డంబో డెలీ, మహాబెల్లీ వంటి రెస్టారెంట్లు కూడా ఆందోళనకారులకు దాహార్తిని తీర్చి, ఆశ్రయంతో పాటు ఆహారాన్ని సరఫరా చేశాయి. ఇప్పుడు ఆ  రెస్టారెంట్ల యజమానులను పోలీస్ స్టేషన్లకు పిలిపించి, ఏ NGO  తరఫున మీరు ఉచితంగా తిండి సరఫరా చేశారంటూ గంటల తరబడి విచారిస్తున్నారు. 

పోలీసుల వేధింపులకు భయపడి పలు రెస్టారెంట్ల యజమానులు తమ సోషల్ మీడియా ఖాతాలలో విద్యార్థుల ఉద్యమానికి మద్దతుగా పెట్టిన పోస్టులను డిలీట్ చేయాల్సి వచ్చిందంటే పోలీసుల వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఇన్ స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో కూడా  ద్వేషపూరిత బెదిరింపు సందేశాలు వస్తున్నాయని యువత ఆందోళన సమయంలో వారికి ఆహారం, నీరు సరఫరా చేసిన రెస్టారెంట్ల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  విద్యార్థుల నిరసనకు మద్దతు తెలిపినందుకు తమను నేరస్థుల్లా వేధిస్తున్నారని   ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   పోలీసుల ఈ విచారణ కేవలం రెస్టారెంట్లకే పరిమితం కాలేదనీ,   స్విగ్గీ, జోమాటో వంటి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థల సిబ్బంది వరకూ కూడా సాగుతోందని అంటున్నారు.  

Jantar Mantar protest food delivery, Delhi Police restaurant crackdown, CJP student protest Delhi,  Blue Tokai Janpath incident 

google-ad-img
    Related Sigment News
    • Loading...