జనసేనలో ఇక ‘ఉద్యమి’.. ‘సాధక్’.. ‘ప్రదాత’లు..
posted on: Feb 15, 2026 2:25PM
.webp)
జనసేన పార్టీ బలోపేతంపై పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మరో కీలక ముందడుగు వేశారు. ఆదివారం ఉదయం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ స్వయంగా మొదటి సభ్యత్వాన్ని తీసుకోవడమే కాకుండా.. సభ్యత్వ నమోదు ప్రక్రియ కోసం తన వంతుగా రూ.2 కోట్ల భారీ విరాళాన్ని పార్టీకి అందజేశారు.
పార్టీ భావజాలాన్ని లోతుగా అర్థం చేసుకుని.. పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేందుకు ఎవరైతే ముందుకు వచ్చి పార్టీ సభ్యత్వం తీసుకుంటారో వారిని ‘ఉద్యమి’గా పిలుస్తామన్నారు. పార్టీ పోరాటానికి మరింత బలాన్ని అందించి, నవతరంలో ప్రేరణ కలిగించి పార్టీ సిద్ధాంతాలకి ఆకర్షితులను చేసి సభ్యత్వ నమోదు చేసేవారిని ‘సాధక్’గానూ, జనసేన పార్టీ చేస్తున్న ప్రజా, రాజకీయ పోరాటానికి పరోక్షంగా తమ వంతు సమయాన్ని, ఆర్థిక, సాంకేతిక, సేవా, మేథా సహాయ సహకారాలు అందిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేసేవారిని ‘ప్రదాత’గా పిలుస్తామని ప్రకటించారు పవన్ కల్యాణ్.


.webp)



