Latest News

2028 నాటికి ప్రతీ ఇంటికీ సురక్షిత తాగునీరు : సీఎం చంద్రబాబు

posted on: Mar 24, 2026 3:48PM

 

హర్ ఘర్ జల్ కార్యక్రమంలో భాగంగా ప్రతీ పల్లెకు, ప్రతీ ఇంటికీ సురక్షిత తాగునీటిని నిరంతరాయంగా అందించే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. జల్ జీవన్ మిషన్ 2.0 కింద 2028 నాటికి రాష్ట్రంలోని ప్రతీ ఇంటికీ తాగునీటి కుళాయి లక్ష్యాన్ని సాకారం చేస్తామని ఆయన  వెల్లడించారు. మంగళవారం జల్ జీవన్ మిషన్ 2.0 పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఢిల్లీలో కుదిరిన ఎంఓయూ కార్యక్రమంలో ముఖ్యమంత్రి  క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్‌గా పాల్గొన్నారు. గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థ ఆపరేషన్, మెయింటెనెన్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని సీఎం పేర్కొన్నారు. 

దీనికి సంబంధించి 2025 సెప్టెంబర్‌లోనే సమగ్ర విధానాన్ని ప్రకటించినట్టు గుర్తు చేశారు. తాగునీటి సరఫరా వ్యవస్థల నిర్వహణ బాధ్యతను పంచాయతీలకు అప్పగించామని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జల్ జీవన్ మిషన్ అమలు విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని అన్నారు. జల్ జీవన్ మిషన్ 2028 వరకు కొనసాగిస్తూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

 పోలవరం ప్రాజెక్టును గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దీనికి కేంద్రం సహకరించాలని ఈ సందర్భంగా సీఆర్ పాటిల్‌ను సీఎం కోరారు. జల్ జీవన్ మిషన్ 2.0 ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం అనంతరం సీఆర్ పాటిల్ మాట్లాడారు. వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు జల్ జీవన్ మిషన్ 2.0కు అనుమతులు ఇచ్చామని చెప్పారు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీతో ఈ విషయంపై సంప్రదించారని, ఈ మిషన్ పొడిగింపు కోసం ప్రతిపాదించడంపై పాటిల్ ధన్యవాదాలు తెలిపారు. 

డ్వాక్రా సభ్యులకు నీటి నాణ్యత పరీక్ష బాధ్యత

‘జల్ జీవన్ మిషన్ కార్యక్రమం మొదటి దశలో 16 కోట్ల మంది గృహాలకు కుళాయిలు ఇచ్చాం. ప్రాజెక్టులో జరిగిన కొన్ని లోపాలను సవరించి నిర్వహణ కూడా చేపడుతున్నాం. మరో 3 కోట్ల ఇళ్లకు సురక్షితమైన తాగు నీటిని అందించాల్సి ఉంది. ఏపీలో నీటి నాణ్యత ను పరీక్షించేందుకు డ్వాక్రా మహిళల సేవల్ని వినియోగించుకోవాలని కోరుతున్నా. జల్ జీవన్ మిషన్ ద్వారా వివిధ ప్రాంతాల్లో 9 కోట్ల మంది మహిళలకు దూరం నుంచి నీరు తెచ్చుకునే కష్టాలు తప్పుతాయి. జేజెఎం 2.0 ద్వారా ఏపీలో ప్రతీ ఇంటికి కుళాయి అనే లక్ష్యం నెరవేరుతుందని ఆశిస్తున్నామని సీఎం తెలిపారు. 2047 వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరాలంటే ప్రతీ ఇంటికీ సురక్షిత తాగునీరు చేరటం ముఖ్యం. 

సాగు కోసం కూడా రైతులకు రెండు సార్లు నీరందితే వారు కూడా సంతోషంగా ఉంటారు. జేజేఎం 2.0 పై త్వరలో ఏపీలో జిల్లాల కలెక్టర్లతో వర్చువల్ మీటింగ్ ఏర్పాటు చేస్తే ప్రాజెక్టు లక్ష్యాలను నిర్దేశించు కుందాం. పీఎం జన్ మన్, పీఎం జన్ భాగీదారీ మిషన్‌లో భాగంగానూ సురక్షిత నీటిని మారుమూల ప్రాంతాలకు అందించేందుకు నిధులు వినియోగించుకోవాలని కోరుతున్నా. జల్ జీవన్ మిషన్ సాకారం అయ్యేందుకు కేంద్రం నుంచి పూర్తి సహకారం అందిస్తాం. ఏపీ పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి.’ అని పాటిల్ చెప్పారు. 

2028 డిసెంబర్ నాటికి ‘హర్ ఘర్ జల్’

ఢిల్లీలోని కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ కార్యాలయంలో జేజేఎం 2.0 పై కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సంతకాలు చేశారు. తాజా ఎంఓయూతో మౌలిక సదుపాయాల కల్పన, పంచాయతీల ఆధ్వర్యంలో కుళాయిల నిర్వహణ వ్యవస్థను బలోపేతం కానుంది. 2028 డిసెంబర్ నాటికి ‘హర్ ఘర్ జల్’ సాకారం చేయాలనేది లక్ష్యం. ఢిల్లీలో ఎంఓయూ కార్యక్రమానికి కేంద్ర జల్ శక్తి కార్యదర్శి అశోక్ కుమార్ మీనా, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తదితర ఉన్నతాధికారులు హాజరుకాగా, అమరావతి నుంచి వర్చువల్‌గా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...