జగ్గీ వాసుదేవ్.. పాదం ఫోటో రూ.3200లా?

posted on: Feb 20, 2026 1:26PM

ఒక పాదం ఫోటో ధర 3200 రూపాయ‌లా?  మాములుగా  గురు చ‌ర‌ణం అంటుంటారు. గురువు పాదాల‌కు విలువ ఉన్న మాట  నిజ‌మే. కానీ అదంతా ద‌త్తాత్రేయ‌, ద‌క్షిణామూర్తి, సాయి వ‌ర‌కూ ఓకేగానీ ఇలా జీవించి ఉన్న వ్య‌క్తుల‌కు సంబంధించి పాదాల‌ను మార్కెట్లో పెట్టి టోకున అమ్మేస్తుంటే దీన్నెలా అర్ధం  చేసుకోవాలి? ఇంత‌కీ ఎవ‌రిదీ  పాదం? ఏమిటా  పాద   మ‌హిమ అని  చూస్తే.. ఈ పాదం జ‌గ్గీ వాసుదేవ్ కి సంబంధించిన‌దిగా తెలుస్తోంది. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది ఈ కాస్ట్ లీ ఫుట్ ఫోటో.

ఇంత‌కీ ఎవ‌రీ జ‌గ్గీ వాసుదేవ్? ఈయ‌న ఆధ్యాత్మ‌క ప్ర‌యాణ‌మేంటి? ఆ ప్ర‌స్తానం ఎలాంటిది? ఆయ‌న భార్య 31 ఏళ్ల‌కే మ‌హా సమాధి పేరిట ఎలా మ‌ర‌ణించారు?  వంటి  ఎన్నో అంశాలపై ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో తెగ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  

జ‌గ్గీ వాసుదేవ్ క‌ర్ణాట‌క‌లోని  మైసూర్ వీధుల్లో ఒక సాదా సీదా కోళ్ల ఫారం య‌జ‌మానిగా    కెరీర్ మొద‌లు పెట్టారు. ఈయ‌న రియ‌ల్ ఎస్టేట్ బ్రోక‌ర్ గానూ తొలి నాళ్ల‌లో ప‌ని చేశారంటారు.  సాధార‌ణ మాన‌వుడిగా న‌డుస్తోన్న జ‌గ్గీ వాసుదేవ్  జీవితం ఒక్క‌సారిగా ఆధ్యాత్మిక‌త వైపున‌కు మ‌ళ్లింది.  తనకున్న భాషా ప‌రిజ్ఞానంతో ఒక ఆధ్యాత్మిక గురువు కాగ‌లిగితే.. ఈ కోడి గుడ్లు లెక్క‌లు పెట్టుకునే ప‌ని త‌ప్పుతుంద‌ని భావించిన జ‌గ్గీ త‌న ప్ర‌యోగం తొలుత త‌న భార్య విజ‌య‌కుమారిపై చేశారు. ఆమె మృతిని ఒక మ‌హాస‌మాధిగా  చిత్రించే య‌త్నం చేశారు జ‌గ్గీ వాసుదేవ్. 

నిజానికి అదొక మ‌ర్డ‌ర్ ప్లాన్ గా చెబుతారు  జగ్గీ వాసుదేవ్  భార్య విజ‌య‌కుమారి తండ్రి గంగాధ‌ర్. జ‌గ్గీ వాసుదేవ్ అప్ప‌టికే ఏర్పాటు చేసిన ఆశ్ర‌మంలో ఒక మ‌హిళ‌ను ట్రాప్చేశారనీ.. ఇందుకు త‌న కుమార్తె విజ‌య‌కుమారి అడ్డుగా  ఉండ‌టంతో ఆమెను చంపి దానికి  మ‌హా స‌మాధి అనే  క‌ల‌రింగ్ ఇచ్చారని గంగాధర్  బెంగ‌ళూరు, మైసూరులో పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.  

నిజానికి మ‌హా స‌మాధి అంటే వారిని ద‌హ‌నం  చేయ‌రు. ఖ‌న‌నం చేస్తారు. కానీ సాక్ష్యాధారాలు ల‌భించ‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డడంలో భాగంగా జగ్గీవాసుదేవ్ త‌న భార్య మృత‌దేహాన్ని దహనం చేశారని గంగాధర్ ఆరోపణ.  అనుమానాస్పద స్థితిలో చనిపోయిన ఆమె మృతదేహానికి పోస్టుమార్టం జరగకుండా.. పోలీసులు వచ్చేలోపే అత్యంత వేగంగా దహనం చేయడం వెనుక సాక్ష్యాలను రూపుమాపే కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు గంగాధ‌ర్.

బేసిగ్గా భార‌తీయ ఆధ్యాత్మిక  నియ‌మాల‌ను అనుస‌రించి  చెబితే సిద్ధుల‌ను మ‌హాస‌మాధి పొందిన త‌ర్వాత‌ ద‌హ‌నం చేయ‌రు.  ఖ‌న‌నం మాత్ర‌మే చేస్తారు. ఆమె ఒక సిద్ధురాల‌ని చెబుతూనే ఆమెను నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా దహనం చేయడం వెనుక పెద్ద కుట్ర ఉందన్నది గంగాధర్ ఆరోపణ.  

ఇక మైసూర్ నుంచి కోయంబ‌త్తూరు వెళ్లి అక్క‌డ కొండ  కింద ఈషా ఫౌండేష‌న్ స్థాప‌న‌లోనూ  ఎంద‌రో గిరిజ‌నుల‌కు, జంతువుల‌కు అన్యాయం జ‌రిగింద‌న్న ఆరోపణలూ ఉన్నాయి.  ప‌ల్లాంటి అనే గిరిజ‌న తెగ‌ల‌ను భ‌య‌పెట్టి, ప్ర‌లోభాల‌కు గురి చేసి వారి భూముల‌ను లాక్కోవ‌డం ద్వారా అతి  పెద్ద ఆశ్ర‌మ సామ్రాజ్యం స్థాపించార‌న్న విమర్శలూ జగ్గీ వాసుదేవ్ పై ఉన్నాయి.  

ఇది కేవ‌లం మ‌నుషుల‌కే  కాక జీవుల‌కూ శాప‌మైంది. కొన్ని  ఏనుగులు అడ‌విలో నివ‌సించ‌డానికి వీలు లేక‌.. బ‌య‌ట‌కొచ్చి అన్యాయంగా  ప్రాణాలు కోల్పోతున్న దుస్థితి తలెత్తిందని గిరిజనులు ఆరోపిస్తున్నారు.   ప్ర‌కృతి ప్రేమ  పేరిట అదే  ప్ర‌కృతి వినాశనానికి పాల్పడుతున్నారని జగ్గీవాసుదేవ్ పై వారు ఆగ్రహం వ్యక్తం చే స్తున్నారు.  
 
ఇక నిధుల సేక‌ర‌ణ‌లో ఈయ‌న పంథా ఎలా ఉంటుందని చూస్తే.. కావేరీ కాలింగ్, ర్యాలీ ఫ‌ర్ రివ‌ర్స్ వంటి కార్య‌క్ర‌మాల పేరిట  కొన్ని వంద‌ల కోట్లు వెన‌కేశార‌నీ,  ఒక మొక్క‌కు 42 రూపాయ‌ల చొప్పున  వ‌సూలు చేసి.. ఆ నిధులు ఏమ‌య్యాయో లెక్కలు చూపలేదనీ జగ్గీవాసుదేవ్ పై కాగ్ వంటి ప్ర‌భుత్వ రంగ‌ సంస్థ‌లు సైతం తమ నివేదికలలో ఆరోపణలు చేశాయి. 

ఆశ్ర‌మానికి వ‌చ్చే యువ‌తీ, యువ‌కుల మైండ్ కంట్రోల్ చేయ‌డం. త‌న సొంత కూమార్తెకు వైభ‌వంగా  పెళ్లి చేసి విదేశాల్లో సెటిల్ చేసిన జ‌గ్గీ వాసుదేవ్.. ఇత‌రుల పిల్ల‌ల్ని మాత్రం త‌న  కాలికింద చెప్పులా మార్చుకుని.. వారి జీవితాల‌ను త‌న స్వార్ధానికి బ‌లి పెట్టేస్తున్నారంటూ ఏకంగా  కోర్టుల‌కు ఎక్కిన త‌ల్లిదండ్రులున్నారు. ఇప్ప‌టికీ  ఆ కేసుల విచారణలు సాగుతున్నాయంటున్నారు. 

ఈ వివాదాల‌న్నీ ఒక ఎత్తు కాగా.. తాజాగా త‌న పాద‌ం ఫోటోల‌ను ఏకంగా  3200 రూపాయ‌ల‌కు అమ్మ‌కానికి పెట్ట‌డం. వాస్తవానికి  32 రూపాయ‌లు కూడా  ఖరీదు చేయని ఫొటోను మూడువేల రెండు వందల రూపాయలకు విక్రయించడం   భ‌క్తుల న‌మ్మ‌కాన్ని నిలువునా దోచుకోవ‌డ‌మే అన్న అన్న విమర్శ వినవస్తున్నది.

google-ad-img
    Related Sigment News
    • Loading...