మండ‌లే వ‌ద్ద‌న్న జ‌గ‌న్ కి ఇప్పుడ‌దే పెద్ద దిక్కా?

posted on: Mar 7, 2026 9:15AM

కాలం ఎంత విచిత్ర‌మైన‌దంటే.. ఒక‌ప్పుడు మీకు క‌నీసం ప్ర‌తిప‌క్ష హోదా లేకుండా చేయ‌గ‌ల‌ను అంటూ  అహంకార పూరితంగా అసెంబ్లీ వేదికగా మాట్లాడిన జగన్  ఇప్పుడు ఆయనే అదే అసెంబ్లీలో   ప్రతిపక్ష  నేత హోదా లేకుండా నిలిచారు. వైసీపీకి కనీసం ప్రతిపక్ష  హోదా  దక్కలేదు. స‌రిగ్గా  అదే స‌మ‌యంలో ఒక‌ప్పుడు ఈ శాస‌న  మండ‌లి అన్న‌దే వృథా ఖ‌ర్చు,  కాల‌యాప‌న అన్న జ‌గ‌న్ నేడు అదే శాస‌న మండ‌లిని ఆధారం చేసుకుని తన రాజకీయ ఉనికిని చాటుకుంటున్నారు. 

బొత్స‌ను ఎమ్మెల్సీని చేసి,  త‌ద్వారా ఆయనకు మండ‌లి  ప్ర‌తిప‌క్ష  నేత హోదా  క‌ల్పించి, ఇక్క‌డ త‌మ ఉనికి కాపాడుకునే య‌త్నం చేస్తున్నారు జ‌గ‌న్. నాడు  చంద్రబాబుకు ప్ర‌తిప‌క్ష హోదా లేకుండా  చేస్తాన‌ని బీరాలు పలికిన జ‌గ‌న్.. ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేకపోవడంతో సాధార‌ణ ఎమ్మెల్యేగా స‌భ‌కు వెళ్ల‌లేక గైర్హాజ‌ర‌వుతున్నారు. ఓడ‌లు బండ్లు అవుతాయి. బండ్లే ఓడ‌ల‌వుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు.  ఒక్కోసారి  అవ‌స‌రం  తీరిపోయిన త‌ర్వాత విసిరేసిన తెడ్డే.. చివ‌రికి  ప‌డ‌వ బోల్తా  ప‌డ్డ‌ప్పుడు దిక్క‌వుతుంది. అన్న‌దానికి జ‌గ‌న్ అప‌రిప‌క్వంతో కూడుకున్న రాజ‌కీయ విధానాలే  ఉదాహ‌ర‌ణంటున్నారు.

175 స్థానాలున్న ఏపీ అసెంబ్లీకి 2024లో జరిగిన ఎన్నికలలో వైపీపీకి కేవలం 11 స్థానాలే వచ్చిన సంగతి తెలిసిందే.  దీంతో ప్ర‌తిప‌క్ష హోదాకు ఉండాల్సిన 18 సీట్ల సంఖ్యా బ‌లం లేక పోవ‌డ‌తో  ఆయన పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు. ఇక జగన్ అసెంబ్లీకి కేవలం పులివెందుల ఎమ్మెల్యే హోదాలో మాత్రమే హాజరు కావాల్సిన పరిస్థితి.  అందుకే గైర్హాజరౌతున్నారు అది వేరే సంగతి. అదే శాస‌న మండ‌లిలో మొత్తం 58 సీట్లుండ‌గా.. ప్ర‌స్తుతం 30 సీట్ల‌తో వైసీపీ  బ‌లంగా  ఉంది. దీంతో మండలిలో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఉంది. దీంతో ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టే బిల్లుల‌ను అడ్డుకోవ‌డం, లేదా  చ‌ర్చ‌కు ప‌ట్టుబ‌డే అవ‌కాశం వారికి మండలిలో ల‌భిస్తోంది. 
 
గ‌తంలో ఇదే జ‌గ‌న్ మండ‌లిని ర‌ద్దు చేయాల‌ని తీర్మానం చేశారు జ‌గ‌న్. ఎందుకంటే అప్పట్లో  అసెంబ్లీలో వైసీకీ భారీ మెజారిటీ ఉన్నా.. మండ‌లిలో మాత్రం లేదు.   అప్ప‌ట్లో టీడీపికి శాస‌న  మండలిలో  మెజారీ ఉండేది. దీంతో  మూడు రాజ‌ధానుల బిల్లు వంటి  కీల‌క నిర్ణ‌యాల‌ను మండ‌లిలో టీడీపీ  అడ్డుకునేది. దీంతో మండ‌లి  వ‌ల్ల ప్ర‌జా ధ‌నం వృధా, కాల‌యాప‌న  అంటూ ఈసడించిన జగన్  ఇప్పుడుఅదే మండలి నుంచి తమ పార్టీ వాయిస్ వినిపించాల్సిన పరిస్థితి వచ్చింది.  ఇక్క‌డ మ‌రో విచిత్ర‌మేంటంటే..  ఆ తర్వాత మండలిలో వైసీపీకి మెజారిటీ రావడంతో 2021 నాటి రద్దు తీర్మానాన్ని నాటి  జ‌గ‌న్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది.

 అహంకారం ప‌నికిరాదనీ, వ్య‌వ‌స్థ‌ల‌ను అవ‌గాహ‌నారాహిత్యంతో త‌ప్పు ప‌ట్ట‌రాద‌ని.. ఈ   ఉదంతంతో తెలుస్తోంద‌ంటున్నారు పరిశీలకులు.  వ్య‌వ‌స్థ‌ల ప‌ట్ల కనీస గౌర‌వం లేక పోవ‌డం వ‌ల్ల వ‌చ్చిన ఇబ్బందిగా దీన్ని అభివర్ణిస్తూ..  ఇప్పటికైనా తెలిసివచ్చిందా జగన్? అంటూ ఎద్దేవా చేస్తున్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...