జగన్ పార్టీ : ఆత్మహత్యకు సిద్ధమైన నాయకుడు

posted on: Apr 15, 2014 3:19PM

 

 

 

జగన్ పార్టీకి సేవలు అందించి, బోలెడంత ఖర్చుపెట్టి నిండా మునిగిపోయిన ఒక నాయకుడు భోరున ఏడుస్తున్నాడు. ఆత్మహత్య చేసుకోవడానికి రెడీగా వున్నానని చెబుతున్నాడు. ఇంతకీ ఎవరా నాయకుడు? ఏమా కథ? పశ్చిమగోదావరి జిల్లా దెందులూరుకు చెందిన అశోక్ గౌడ్ అనే అమాయకుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీలో వున్నాడు. దెందులూరు అసెంబ్లీ టిక్కెట్ ఇస్తానని జగన్ హామీ ఇవ్వడంతో అప్పటి నుంచి పార్టీ కోసం గాడిద చాకిరీ చేశాడు.

 

పార్టీ కార్యక్రమాలకని, మీటింగ్‌లకని, పాదయాత్రలకని, దానికని, దీనికని మొత్తం నాలుగు కోట్లు ఖర్చుపెట్టాడు. ఈ నాలుగు కోట్ల కోసం ఆస్తులు అమ్మేసుకుని, భారీ స్థాయిలో అప్పులు చేసి పూర్తిగా మునిగిపోయాడు. తీరా ఎన్నికలు వచ్చాక దెందులూరు టిక్కెట్‌ని జగన్ వేరెవరికో ఇచ్చేసరికి అశోక్‌గౌడ్ ఏడుస్తూ రోడ్డున పడ్డాడు. జగన్‌ని నమ్ముకుని తాను సర్వనాశనం అయిపోయానని, ఇక తనకు ఆత్మహత్య చేసుకోవడం మినహా మరో మార్గం లేదని అంటున్నాడు. 



ఇదిలా వుంటే జగన్ పార్టీకే చెందిన మరో నాయకుడు పేర్ని నాని కూడా జగన్ పార్టీ కోసం డబ్బులు ఖర్చుపెట్టీ, ఖర్చుపెట్టీ అప్పులపాలైపోయాడు. ఆస్తులు అమ్ముకుని బికారి అయిపోయాడు. జగన్ ఈయన మీద జాలిపడి మచిలీపట్నం ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చాడు. కానీ, నిండా మునిగిపోయిన తనకి ఎన్నికలలో పోటీ చేసే సత్తా లేదని పేర్ని నాని చేతులెత్తేశాడు. తాను సెలెక్ట్ చేసిన అభ్చర్థి చేతులెత్తేయడంతో కంగుతిన్న జగన్, నీ ఖర్చంతా నేను భరిస్తానని పేర్ని నానీకి హామీ ఇవ్వడంతో ఆయన ఎన్నికలలో నిలబడటానికి అంగీకరించినట్టు తెలుస్తోంది. అశోక్ గౌడ్, పేర్ని నాని... బయటకి తెలిసిన స్టోరీలివి. తెలియని స్టోరీలు ఎన్ని వున్నాయో.

google-ad-img
    Related Sigment News
    • Loading...