జగన్ గుంటూరు ర్యాలీ.. అంబటి కోసమా?.. అలజడి కోసమా?
posted on: Feb 4, 2026 8:45AM

గత ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత నుంచి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీకి గెస్ట్ ఆర్టిస్ట్ గా మాత్రమే వచ్చి వెడుతున్నారు. గత ఎన్నికలలో వైసీపీ పరాయం తరువాత నుంచీ ఏపీకి వచ్చి వెడుతున్న జగన్ షెడ్యూల్ ను గమనిస్తే ఆయన వారంలో మూడు రోజులు మాత్రమే ఏపీకి కేటాయిస్తున్నారు. ఆ మూడు రోజులలోరెండు ఆయన బెంగళూరు నుంచి రాక, పోకకు తీసేస్తే నికరంగా ఆయన రాష్ట్రంలో ఉంటున్నది కేవలం ఒక్క రోజు మాత్రమే. అంటే ఆయన బుధవారం ఏపీలోకి అడుగుపెట్టి.. గురువారం మళ్లీ బెంగళూరు ప్యాలెస్ కు తిరుగు ప్రయాణం అవుతున్నారు. విపక్ష హోదా కూడా లేకుండా వైసీపీ పరాజయం పాలైన తరువాత ఆయన షెడ్యూల్ దాదాపుగా ఇలాగే ఉంది.
ఈ సారి కూడా ఆయన బుధవారం ఏపీకి వస్తున్నారు. అయితే ఈ సారి ఆయన రాకకు ఒక ప్రాధాన్యత ఉంది. అదే బూతుపురాణం కారణంగా అంబటి అరెస్టు. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్య లు, దుర్భాషల కారణంగా అంబటి అరెస్టయ్యారు. ఆయన అరెస్టుకు ముందు సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం శ్రేణులు గుంటూరులోని ఆయన నివాసంపై దాడి చేశారు. ఈ నేపథ్యంలో జగన్ బుధవారం (ఫిబ్రవరి 4) అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఆ పరామర్శకు కూడా భారీ ర్యాలీతో వెళ్లనున్నారు. వాస్తవానికి ఆయన పరామర్శించాల్సింది (అసలా అవసరం లేదు. ఎందుకంటే అంబటి అరెస్టైంది ఏదో ప్రజా సమస్యపై ఆందోళన చేసి కాదు. సీఎంపై అసభ్య, సభ్య సమాజం ఉచ్ఛరించడానికి కూడా ఇష్టపడని బూతులతో విరుచుకుపడినందుకు) రాజమహేంద్రవరంలో ఉన్న అంబటి రాంబాబును. కానీ జగన్ మాత్రం గుంటూరు లో ర్యాలీ చేసి అంబటి నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిం చనున్నారు.
అసలు అంబటి రాంబాబు అరెస్టై రిమాండ్ ఖైదీగా రాజమహేంద్రవరం జైలుకు వెళ్లి మూడు రోజులు అయ్యింది. ఆయన నివాసంపై దాడి జరిగి నాలుగు రోజులు. నిజంగా అంబటి నివాసంపై దాడి, అంబటి అరెస్టుపై జగన్ నిజంగా ఆగ్రహం చెందారంటే.. దాడి జరిగిన రోజునే బెంగళూరు నుంచి హుటాహుటిన వచ్చి ఉండాలి.
కానీ ఆయన షెడ్యూల్ లో ఎటువంటి మార్పూ లేదు. యధావిధిగా ఆయన బుధవారం (ఫిబ్రవరి 4)నే బెంగళూరు ప్యాలెస్ నుంచి రాష్ట్రానికి వచ్చారు. అయితే ఈ సారి తాడేపల్లి ప్యాలెస్ లో మీడియా మీట్ తో సరిపెట్టకుండా, గుంటూరులో ర్యాలీ చేయనున్నారు. అంబటి రాజమహేంద్రవరం జైలులో ఉంటే జగన్ కనీసం అటుకేసి కూడా చూడటం లేదు. కేవలం గుంటూరుకే పరిమితమై.. అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించడంతో సరిపెట్టేయనున్నారు. ఈ సారి ర్యాలీ సందర్భంగా కూడా భారీ జనసమీకరణ, శాంతి భద్రతలకు భంగం వాటిల్లడం లాంటి వ్యూహాలు వైసీపీయులు చేసే ఉంటారన్న అంచనాతో పోలీసులు అప్రమత్తమయ్యారు.



.webp)
.webp)



