అసెంబ్లీకి హాజరు.. కేసీఆర్ బాటలోనే జగన్..?

posted on: Feb 10, 2026 9:15AM

మాట తప్పం మడమ తిప్పం అంటూ సొంత భుజాలను చరుచుకునే జగన్ ప్రతిపక్ష హోదా విషయంలో యూటర్న్ తీసుకున్నారు. తనకు ప్రతిపక్ష నేత హోదా, తన పార్టీని ప్రతిపక్ష పార్టీగా గుర్తించేంత వరకూ అసెంబ్లీకి హాజరయ్యేది లేదని మంకుపట్టుపట్టిన ఆయన అ హోదో ఎటూ రాదు.. కనీసం సభ్యత్వాన్ని కాపాడుకుని, ఎమ్మెల్యేగా జీతభత్యాలు వదులు కోవడం ఎందుకు అనుకున్నారో ఏమో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించుకున్నారు.   రాని హోదా కోసం పాకులాడి ఉన్న సభ్యత్వాన్ని కోల్పోవడమెందుకని భావించారో ఏమో తెలియదు కానీ.. ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరు కావాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. జగన్ సహా ఆ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలూ, బుధవారం (ఫిబ్రవరి 11) నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు హాజరు కానున్నారు.  తొలిరోజు గవర్నర్ ప్రసంగానికి హాజరయ్యాక అదే రోజు మధ్యాహ్నం జగన్ అధ్యక్షతన వైసీపీ శాసనసభాపక్ష సమావేశం జరగుతుంది. పూర్తిస్థాయిలో సమావేశాలకు హాజరవ్వాలా? లేదా? అన్న విషయాన్ని ఆ సమావేశంలో నిర్ణయించనున్నారు.  

బుధవారం (ఫిబ్రవరి 11)  తొలి రోజు సభ ప్రారంభం అవ్వగానే ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది.  గత ఏడాది అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగాన్ని వైసీపీ అడ్డుకుంది. ఈసారి కూడా సభకు వచ్చి గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకే వైసీపీ సభ్యులు ప్రయత్నించే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.  ఇప్పటి వరకూ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీని బాయ్ కాట్ చేసినా.. సభలో చర్చించిన అంశాలు, ఆమోదించిన బిల్లులపై తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చొని ఆ పార్టీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్  ప్రెస్‌మీట్లు పెట్టి మాట్లాడుతూ వచ్చారు. శాసనసభకు రాకపోయినా ఆ విధంగా తన అభిప్రాయాలు ప్రజలకు తెలియజేస్తే సరిపోతుందని జగన్ స్వయంగా ప్రకటించారు కూడా. ఆ క్రమంలో  స్పీకర్ అయన్నపాత్రుడు నో వర్క్ నో పే విధానంపై  మాట్లాడారు. సభకు హాజరు కాకుండా ప్రజాధనం ద్వారా జీతాలు తీసుకోవడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో రాజ్యాంగ పరిధిలో ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.  కొందరు సభ్యులు అసెంబ్లీ రిజిస్టర్‌లో సంతకం చేసి సభకు రాకపోవడంపైనా ఆయన ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేశారు.

దాంతో ఈ సారి కూడా వైసీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరైతే నో వర్క్ నో పే ప్రతిపాదన అమలవుతుందా అనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. అలాగే సుదీర్ఘంగా సభకు గైర్హాజరైతే అసెంబ్లీ సభ్యత్వం గల్లంతయ్యే అవకాశాలున్నాయా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఈ నేపధ్యంలో వైసీపీ ప్రత్యేక హోదా డిమాండ్ కు తిలోదకాలిచ్చి సభ్యత్వాన్ని కాపాడుకోవడానికో, లేక ఎమ్మెల్యులుగా జీత భత్యాలు వదులు కోవడానికి మనస్కరించకో హాజరు నిర్ణయం తీసుకుని ఉంటారన్న చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. అయితే జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యులుఈ సారి బడ్జెట్ సమావేశాల తొలిరోజున  మాత్రమే హాజరై, రిజిస్టర్ లో సంతకం చేసి వెళ్లిపోతారా? అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయంలో జగన్ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ బాటలో నడిచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని పోలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...