జగన్, ఉదయనిధి స్టాలిన్.. ఇద్దరూ ఇద్దరే?!
posted on: Feb 9, 2026 3:25PM

హిందూ వ్యతిరేకత విషయంలో ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిథి స్టాలిన్ ల మధ్య నేనంటే నేను గోప్ప అన్న సంవాదం నడుస్తోందా? తాజాగా ఇరువురూ చెన్నైలోని ఓ వివాహ వేడుకలో కలుసుకుని పక్కపక్కనే కూర్చుని ముచ్చటించుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. జగన్ సమీప బంధువు సునీల్ రెడ్డి కుమారుడి వివాహం ఆదివారం (ఫిబ్రవరి 9) చెన్నైలో అంగరంగ వైభవంగా జరిగింది. ఆ వివాహ వేడుకకు జగన్, ఉదయనిథి స్టాలిన్ హాజరయ్యారు. సినీ రాజకీయ రంగాలకు చెందిన ఎందరో అతిరథ మహారథులు కూడా ఈ వివాహానికి హాజరయ్యారనుకోండి అది వేరే సంగతి. జగన్ ఉదయనిథి స్టాలిన్ ఇరువురూ ఆ వివాహ వేడుకలో కలిసి కొద్ది సేపు ముచ్చటించుకున్నారు. అందుకు సంబంధించి సామాజిక మాధ్యమంలో నెటిజనులు వారి హిందూ వ్యతిరేక వైఖరిపై ఓ రేంజ్ లో సెటైర్లు గుప్పిస్తూ ట్రోల్ చేస్తున్నారు.
ఆ ట్రోలింగ్ లో భాగంగానే సనాతన ధర్మం అనేది వైరస్ అని భలే అన్నావ్ అని జగన్ రెడ్డి అంటే.. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించిన నీ ముందు నేనెంత అన్న చర్చ జరిగి ఉంటుందంటూ నెటిజనులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. హిందూ ధర్మంపై వ్యతిరేకత విషయంలో ఉదయనిధి స్టాలిన్, వైఎస్ జగన్ లలో ఎవరు ఎక్కువ? ఎవరు తక్కువ అన్న డిబేట్ కు కూడా వీరిరువురి భేటీ దృశ్యాలు దోహదం చేశాయి. వీరిరువురిలో ఉదయనిథి స్టాలిన్ ఒక రకంగా బెటర్.. ఆయన ఎటువంటి దాపరికం లేకుండా తన హిందూ వ్యతిరేక వాణిని కుండబద్దలు కొట్టినట్లు బాహాటంగానే వ్యక్తం చేశారు.
ఆ విషయంలో ఆయనకు ఎటువంటి శషబిషలూ లేవు. అయితే జగన్ అలా కాదు.. ఓ పక్క తాను హిందూ వ్యతిరేకిని కానని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తూనే.. చేతల్లో తన వ్యతిరేకత చూపుతుంటారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పరకామణి చోరీ చాలా చిన్న వ్యవహారం అనడం. తిరుమల లడ్డూలో వినియోగించే నెయ్యి కల్తీ అని ధృవపడినా, అందులో జంతువుల కొవ్వు కలవలేదుగా అంటూ బుకాయించడం వరకూ జగన్ హిందూ వ్యతిరేకతను చాపకింద నీరులా కనిపించీ కనిపించకుండా చాటుతున్నారని అంటున్నారు. మొత్తం మీద జగన్, ఉదయనిధి స్టాలిన్ ఇద్దరూ ఇద్దరే. హిందూ వ్యతిరేకత విషయంలో ఎవరినీ తక్కువ చేయడానికి అవకాశం లేదని అంటున్నారు.




.webp)
.webp)


