ఇస్లామాబాద్ శాంతి చర్చలు విఫలం.. ఇక ఇరాన్ పై అమెరికా సైనిక చర్యేనా?

posted on: Apr 12, 2026 8:19AM

అమెరికా ఇరాన్ మధ్య చర్చలు విఫలమయ్యాయి. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా జరిగిన చర్చల్లో ఇరాన్ అమెరికా విధించిన కఠినమైన నిబంధనలను అంగీకరించలేదు.  దాదాపు 21 గంటల పాటు జరిగిన ఈ చర్చల్లో అమెరకా ఉపాధ్యక్షుడు డీన్ వాన్స్ పాల్గొన్నారు.  అమెరికా విధించిన నిబంధనల విషయంలో  ఇరాన్ మొండి పట్టుదలకు పోతోందని అగ్రరాజ్య ఉపాధ్యక్షుడు చెప్పారు.  ముఖ్యంగా ఇరాన్ అణ్వాయుధాల తయారీని పూర్తిగా నిలిపివేయాలన్న ట్రంప్ షరతుకు ఇరాన్ నో అంటోందంటున్నారు.  

అమెరికా విధించిన  రెడ్ లైన్స్  వెనుక బలమైన కారణం ఉందన్న  జేడీ వాన్స్, ఇరాన్ గనుక అణ్వాయుధాన్ని సాధిస్తే, అది ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఆయుధ పోటీకి దారితీస్తుందన్నారు. ఇరాన్ అణు కార్యక్రమం ఒక్క అమెరికాకు మాత్రమే  కాదు ప్రపంచ శాంతికే ముప్పన్నారు. ఇక ఇరాన్ పై అమెరికా తదుపరి వైఖరి ఏమిటన్నది అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ నిర్ణయిస్తారన్న జేడీ వాన్స్  సైనిక చర్యపై పరోక్ష సంకేతాలిచ్చారు.  ఇప్పటికే మధ్యప్రాచ్యానికి అమెరికా తన యుద్ధ విమానాలను, విమాన వాహక నౌకలను పంపిన నేపథ్యంలో ఉపాధ్యక్షుడి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

అదలా ఉండగా..  ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ మాత్రం చర్చలు 'నిర్మాణాత్మకంగా' సాగాయని, కొన్ని ప్రాథమిక సూత్రాలపై అంగీకారం కుదిరిందని చెబుతున్నారు. ఇక ఇజ్రాయెల్ అయితే ఈ చర్చలను కంటితుడుపు చర్యగా కొట్టి పారేసింది.   . అమెరికా ఆంక్షల నుండి విముక్తి పొందాలని ఇరాన్ డిమాండ్ చేస్తుంటే.. ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా పక్కన పెడితేనే అది సాధ్యమని ట్రంప్ ప్రభుత్వం కరాఖండీగా చెబుతోంది.  

చర్చల నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటిస్తూ అమెరికా ఉపాధ్యక్షుడు ఆదివారం (ఏప్రిల్ 12) ఉదయం ఇస్లామాబాద్ లో  ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో  కీలక వ్యాఖ్యలు చేశారు.  ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని సాధించకుండా నిరోధించడమే అమెరికా ప్రధాన లక్ష్యమన్నారు.  ఈ దిశగా  ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి చిత్తశుద్ధితో ప్రయత్నించామనీ,  దురదృష్టవశాత్తు పురోగతి సాధించలేకపోయామనీ అన్నారు.  ప్రస్తుతం చర్చల నుంచి వైదొలుగుతున్నామని ఆయన స్పష్టం చేశారు. ముందు ముందు ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే అని పరోక్షంగా ఇరాన్ పై సైనిక చర్య తప్పదన్న సంకేతాలిచ్చారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...