హోదాని అటక ఎక్కించారు.. కనీసం ఇప్పుడైనా పోరాడతారా జగన్?
posted on: Jul 5, 2019 6:03PM

2019-2020 ఆర్ధిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్ను కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం లోక్సభలో ప్రవేశపెట్టారు. ఎప్పటిలాగానే బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు నిరాశే ఎదురైంది. ముఖ్యంగా ఏపీకి అన్యాయం జరిగిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి కూడా బడ్జెట్ పై అసంతృప్తి వ్యక్తం చేసారు. ఏపీకి కేంద్రం మొండిచేయి చూపించిందని విమర్శించారు. అయితే ఇప్పుడు కేంద్ర బడ్జెట్ పై ఏపీ సీఎం జగన్ ఎలా స్పందిస్తారోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది.
ఎన్నికలకు ముందు.. తమ పార్టీని గెలిపిస్తే ఏపీకి న్యాయం జరిగేలా చూస్తామని జగన్ చెప్పారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించట్లేదు. ఇప్పటికే ప్రత్యేకహోదా విషయంలో.. బీజేపీకి పూర్తీ మెజారిటీ ఉందని, కాబట్టి బ్రతిమాలడం తప్ప చేసేదేమి లేదని జగన్ చేతులెత్తేశారు. మరోవైపు బీజేపీ నేతలేమో హోదా ముగిసిన అధ్యాయమని కుండబద్దలు కొట్టేసారు. మొత్తానికి అందరూ కలిసి హోదా విషయం అటక ఎక్కించారు. హోదా విషయంలో మొండిచేయి చూపిన కేంద్రం.. బడ్జెట్ లో కూడా ఏపీకి అన్యాయం చేసింది. ఏదో విజయ సాయి మీడియా ముందుకొచ్చి అన్యాయం జరిగిందని చెప్పారు సరే. మరి సీఎం జగన్ ఏం చేయబోతున్నారు?. గతంలో కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగితే, అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ మీద వైసీపీ తీవ్ర విమర్శలు చేసింది. టీడీపీ కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి ఏం తీసుకురాలేకపోతుందని వైసీపీ పదే పదే విమర్శలు చేసింది.
కట్ చేస్తే.. ఇప్పుడు రోజులు మారాయి. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. మళ్ళీ కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగింది. మరి ఇప్పుడు జగన్ ఏం చేయబోతున్నారు?. కేంద్రం మెడలు వంచి ఏపీకి న్యాయం జరిగేలా చూస్తారా?. లేక హోదా విషయంలో వెనక్కి తగ్గినట్టే తగ్గి విమర్శలు పాలవుతారా?. ఏపీ ప్రజలు జగన్ ని నమ్మి వైసీపీకి 151 ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీ సీట్లు కట్టబెట్టారు. 22 ఎంపీ సీట్లు అంటే మాములు విషయం కాదు. ప్రాంతీయ పార్టీలలో ఎంపీల సంఖ్యా పరంగా వైసీపీనే ముందు వరుసలో ఉంది. మరి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు?. పార్లమెంట్ సాక్షిగా వైసీపీ ఎంపీలతో ఏపీకి న్యాయం జరిగేదాకా పోరాటం చేయిస్తారా? లేక బీజేపీని ఢీ కొట్టడం రిస్క్ ఎందుకని సైలెంట్ గా ఉంటారో కాలమే నిర్ణయిస్తుంది.





.webp)

.webp)


