Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఇరాన్ అమెరికా షరతులకు నిజంగానే అంగీకరించిందా?
posted on: Jun 13, 2026 10:50AM

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ.. అంతర్జాతీయ వేదికపై దౌత్యపరమైన డ్రామా నడుస్తోంది. ఇరుపక్షాల నుండి వస్తున్న పరస్పర విరుద్ధ ప్రకటనలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. అసలు ఇరాన్ తన అణు కార్యక్రమాలను పూర్తిగా పక్కన పెట్టడానికి.. అణు ఆయుధాలను ఉపసంహరించుకోవడానికీ అంగీకరించిందంటూ అగ్రరాజ్యాధినేత ట్రంప్ ప్రకటనలు, వాటిని ఖండిస్తూ వెంటనే ఇజ్రాయెల్ చేస్తున్న ప్రకటనలు ప్రపంచ దేశాలను గందరగోళంలోపడేస్తున్నాయి. అణుకార్యక్రమాన్ని పక్కన పెట్టేయడానికి ఇరాన్ అంగీకరించిందా అనే చర్చ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ హాట్ గా సాగుతోంది. ఇరాన్, అమెరికా శాంతి ఒప్పందానికి సంబంధించి వైట్ హౌస్ అధికారులు సంచలన ప్రకటన విడుదల చేశారు. ఇరాన్ ఒక కఠినమైన పనితీరు ఆధారిత ఒప్పందానికి అంగీకరించిందనీ.. దీని ప్రకారం ఆ దేశంపై ఉన్న ఆర్థిక ఆంక్షలు ఎత్తివేయాలంటే.. ముందుగా ఇరాన్ భారీ రాయితీలు ఇవ్వాల్సి ఉంటుందని అమెరికా పేర్కొంది.
వైట్ హౌస్ నివేదికల ప్రకారం.. ఇరాన్ వద్ద ఉన్న అణు ఇంధనాన్ని పూర్తిగా నాశనం చేసి, అక్కడి నుండి తరలించాల్సి ఉంటుంది. అలాగే వారి అణు కార్యక్రమాలను నిలిపివేయాలి. ఇరాన్ ఈ నిబంధనలన్నింటినీ నెరవేర్చే వరకు అమెరికా ఆంక్షలను ఎత్తివేయదు సరే కదా.. వారి నిధులను కూడా విడుదల చేయదు. దీనితో పాటు, అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ) సముద్ర మార్గాన్ని ఎల్లప్పుడూ తెరిచే ఉంచడానికి, అలాగే ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూర్చడం నిలిపివేయడానికి కూడా ఇరాన్ అంగీకరించిందని అమెరికా అధికారులు చెప్పుకొచ్చారు. అయితే, దీనికి ప్రతిగా అమెరికా తన సైనిక చర్యలను పూర్తిగా ఆపాల్సి ఉంటుంది. కానీ.. వైట్ హౌస్ ప్రకటనలను ఇరాన్ నిర్ద్వంద్వంగా ఖండించింది. తాము ఎలాంటి కఠినమైన నిబంధనలకు, షరతులకు అంగీకరించలేదని కుండబద్దలు కొట్టేసింది.
ఈ దౌత్య యుద్ధం ఇలా సాగుతుండగానే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై మరో తీవ్రమైన ఆరోపణ చేశారు. హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న భారతీయ నౌకలపై ఇరాన్ డ్రోన్ దాడులకు పాల్పడిందన్నది ఆయన ఆరోపణ. ఈ విఫల దాడులు ముమ్మాటికీ ఆమోదయోగ్యం కాదని ట్రంప్ మండిపడ్డారు. ఇరాన్ దాడులకు పాల్పడిందనే విషయానికి సంబంధించి ట్రంప్ ఎలాంటి నిర్దిష్ట ఆధారాలను మీడియా ముందు ఉంచలేదు. దీనిపై ఇరాన్ అధికారులు కూడా ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.
మరోవైపు శాంతి చర్చల వివరాలను ఇరాన్ మీడియాకు లీక్ చేస్తోందని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ ప్రజలకు చెబుతున్న విషయాలకు, తెరవెనుక ఇరు దేశాలు రాతపూర్వకంగా అంగీకరించిన అసలు నిబంధనలకు అస్సలు సంబంధం లేదని వాదించారు. ఇరాన్ చర్చల్లో నిజాయితీగా వ్యవహరించడం లేదని ఆరోపిస్తూ.. ఇరాన్ త్వరగా తన వైఖరిని మార్చుకోవాలంటూ.. హెచ్చరించారు. మొత్తం మీద ఇరాన్, అమెరికా మధ్య శాంతి ఒప్పందం విషయంలో రెండు దేశాలూ చేస్తున్నపరస్పర విరుద్ధ ప్రపకటనలు ప్రపంచ దేశాలను గందరగోళంలో పడేస్తున్నాయి.






