Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...2026 డీలిమిటేషన్ సెగ.. పార్లమెంట్లో ఓటమి.. బీజేపీ రాజకీయ విజయం?
posted on: Apr 20, 2026 10:16AM

దేశ రాజకీయాల్లో ఇప్పుడు 2026 డీలిమిటేషన్ ఒక హాట్ టాపిక్ గా మారింది. లోక్సభ స్థానాల పెంపు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన కీలక బిల్లులు పార్లమెంట్లో అవసరమైన మెజారిటీ లేక వీగిపోవడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ప్రతిపక్ష కూటమి దీనిని కేంద్ర ప్రభుత్వ ఓటమిగా అభివర్ణిస్తున్నప్పటికీ, లోతుగా పరిశీలిస్తే ఇది అధికార బీజేపీకి వచ్చే ఎన్నికల కోసం ఒక బలమైన ప్రచార అస్త్రాన్ని అందించినట్లు కనిపిస్తోంది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 81, 82 ప్రకారం.. ప్రతి జనాభా లెక్కల తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరగడం అనేది ఒక అనివార్యమైన ప్రక్రియ. ఇది ఏ రాజకీయ పార్టీ సొంత నిర్ణయం కాదు.. రాజ్యాంగబద్ధమైన విధి. గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుం డటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మహిళా రిజర్వేషన్ల అమలు కూడా డీలిమిటేషన్తోనే ముడిపడి ఉంది. 2023లో ఆమోదించిన బిల్లు ప్రకారం, నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే మహిళలకు 33 శాతం కోటా అమల్లోకి వస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఒక మధ్యేమార్గంలా ' 50శాతం సీట్ల పెంపు'ఫార్ములాను ప్రతిపాదించింది. అంటే.. అన్ని రాష్ట్రాలకు ప్రస్తుతం ఉన్న సీట్లపై 50 శాతం అదనంగా కేటాయిం చడం ద్వారా దక్షిణాది రాష్ట్రాల ప్రాబల్యం తగ్గకుండా చూడాలనేది కేంద్రం వాదన. అయితే, దీనివల్ల బీజేపీకి మహిళా రిజర్వేషన్ క్రెడిట్ దక్కుతుందని, ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు పెరిగి తమ పట్టు తగ్గుతుందని భావించిన డిఎంకె వంటి ప్రాంతీయ పార్టీలు, ఇండియా కూటమి దీనిని తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రతిపక్షాల అడ్డంకులతో ఈ 50 శాతం అదనపు సీట్ల ఫార్ములా తిరస్కరణకు గురైంది.
అయితే, ఇదే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు శాపంగా మారే అవకాశం ఉంది. ప్రత్యేక ఫార్ములాలు ఏవీ లేకపోతే.. ఇప్పుడు డీలిమిటేషన్ పూర్తిగా జనాభా ప్రాతిపదికన మాత్రమే జరుగుతుంది. జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి దక్షిణాది రాష్ట్రాలు దీనివల్ల సీట్లను కోల్పోయే ప్రమాదం ఉంది. మరోవైపు.. జనాభా భారీగా పెరిగిన ఉత్తరాది రాష్ట్రాలకు లోక్సభలో బలం పెరుగుతుంది. అంటే.. పార్లమెంట్లో బిల్లును అడ్డుకోవడం ద్వారా విపక్షాలు దీర్ఘకాలంలో దక్షిణాది గొంతుకను బలహీనపరిచాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాలను బీజేపీ తనకి అనుకూలమైన నేరేటివ్గా మార్చుకునే పనిలో పడింది. మేము మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలని చూస్తే ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని మహిళా ఓటర్లకు.. దక్షిణాది సీట్లు తగ్గకుండా మేము రక్షించే ప్రయత్నం చేస్తే విపక్షాలే చెడగొట్టాయి అని దక్షిణాది ప్రజలకు బీజేపీ వివరించే అవకాశం ఉంది.
అలాగే ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా తమ ప్రాతినిధ్యాన్ని విపక్షాలు అడ్డుకుంటున్నాయనే భావనను కలిగించడం ద్వారా 2029 ఎన్నికల అజెండాను బీజేపీ ఇప్పుడే సిద్ధం చేసుకుంటోంది. ప్రతిపక్షాలు పార్లమెంటరీ పోరాటంలో తాత్కాలిక విజయం సాధించినప్పటికీ, ప్రజాక్షేత్రంలో ఓటర్ల సెంటిమెంట్ను గమనించడంలో మాత్రం ఘోరంగా విఫలమయ్యాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా మహిళా సాధికారతకు అడ్డుపడ్డారనే ముద్ర పడటం విపక్షాలకు నిస్సందేహంగా పెద్ద మైనస్ అవుతుంది. డీలిమిటేషన్ అనేది రాజ్యాంగబద్ధంగా ఎలాగూ జరుగుతుంది.. కానీ కేంద్రం ఇచ్చిన వెసులుబాటును కాలదన్నడం ద్వారా ప్రతిపక్షాలు ఇసుమంతైనా దూరదృష్టి లేకుండా వ్యవహరించి, పార్లమెంట్లో ఈ బిల్లు పాసు కాకుండా అడ్డుకోవడం ద్వారా బీజేపీకి ఒక ఎలక్టోరల్ గిఫ్ట్ గా మారే లా చేశాయని చెప్పవచ్చు.
- సీతారాం కంఠంనేని






