ఢిల్లీలో ఘాతుకం... ఐఆర్ఎస్ అధికారి కుమార్తెపై అత్యాచారం

posted on: Apr 23, 2026 2:43PM

 

దేశ రాజధానిలో ఢిల్లీలో పట్టపగలే దారుణం చోటు చేసుకుంది. ఆగ్నేయ ఢిల్లీలోని సంపన్న ప్రాంతమైన కైలాశ్‌ హిల్స్‌లో ఒక సీనియర్ ఐఆర్‌ఎస్‌ అధికారి కుమార్తె హత్యాచారానికి గురైంది. ఆ ఇంట్లో గతంలో పని చేసిన యువకుడే ఆమెను హతమార్చిన ఘటన కలకలం రేపుతోంది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు.. ఆపై సెల్‌ఫోన్ ఛార్జర్ కేబుల్‌ను మెడకు బిగించి ప్రాణాలు తీశాడు. ఆపై అక్కడి నుంచి జారుకున్నాడు. 

కానీ కొన్ని గంటల వ్యవధిలోనే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. 22 ఏళ్ల వయసున్న హతురాలు ఐఐటీ పట్టభద్రురాలు. సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధం అవుతోంది. బుధవారం ఉదయం ఆమె తల్లిదండ్రులు బయటకు వెళ్లారు. ఇదే అదనుగా 19 ఏళ్ల యువకుడు.. ఇంట్లోకి చొరబడ్డాడు. అప్పటికే ఇంట్లో బాధితురాలు ఒంటరిగా ఉండగా.. నిందితుడు నేరుగా ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. బాధితురాలు ప్రతిఘటించడంతో స్టిక్‌తో తలపై బలంగా కొట్టాడు. అనంతరం అత్యాచారం చేసి, మొబైల్ ఛార్జింగ్ కేబుల్‌ను ఆమె మెడకు బిగించి ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు. తర్వాత ఇంట్లో దోపిడీకి పాల్పడి అక్కడి నుంచి పారిపోయాడు.


అయితే సాయంత్రం ఇంటికి వచ్చిన ఐఆర్ఎస్ దంపతులు.. తమ కుమార్తె చనిపోయి ఉండటాన్ని చూసి షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా.. నిందితుడు రాహుల్ మీనా ఇంట్లోకి వెళ్లడం, తిరిగి రావడం స్పష్టంగా రికార్డయ్యింది. ఇదే వీడియోను బాధితురాలి తల్లిదండ్రులకు చూపించగా.. వాళ్లు విస్తుపోయే విషయాలు చెప్పారు. నిందితుడి పేరు రాహుల్ మీనా అని.. అతడు 8 నెలలపాటు తమ ఇంట్లోనే పని చేశాడని చెప్పారు. 

అయితే ఇంట్లో వస్తువులకు సంబంధించిన కొనుగోలు బిల్లుల విషయంలో అవకతవకలకు పాల్పడటంతో అతడిని నెల రోజుల క్రితమే పనిలోంచి తొలగించామని చెప్పారు. దీంతో పోలీసులు గాలింపు చేపట్టి, బుధవారం సాయంత్రానికే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆపై అతడిని విచారించగా.. తనను పనిలోంచి తొలగించారన్న కోపంతోనే ఇలా ప్రతీకారం తీర్చుకున్నాని చెప్పాడు. ప్రస్తుతం ఇతడిపై అత్యాచారం, హత్య కేసులు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...