Latest News
అమెరికా సైనిక సిబ్బందికి ఆశ్రయం ఇస్తే దాడులు.. యూఏఈ హోటళ్లకు ఇరాన్ హెచ్చరిక
posted on: Mar 27, 2026 12:17PM

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ గల్ఫ్ దేశాల్లోని హోటళ్లకు ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా సైనికులకు ఆశ్రయం కల్పిస్తే దాడులు తప్పవని అల్టిమేటం జారీ చేసింది. బహ్రెయిన్, యూఏఈ లోని హోటళ్లు అమెరికా సైనిక సిబ్బందికి ఆశ్రయం కల్పిస్తే.. ఆ హోటళ్లు ఇరాన్ సైనిక లక్ష్యాలుగా మారతాయని వార్నింగ్ ఇచ్చింది.
ఈ విషయంపై ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘ్చి ఒక ప్రకటనలో అమెరికా సైనికులు తమ స్థావరాల నుంచి పారిపోయి, హోటళ్లలో తలదాచుకుని పౌర ప్రాంతాలను కవచంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాల్లోని సైనిక స్థావరాల నుంచి పారిపోయిన అమెరికా సైనికులు హోటళ్లలో తలదాచుకుంటూ.. పౌరులను మానవ కవచాలుగా ఉపయోగించుకుంటున్నాయన్న ఆయన. ఇక అటువంటి వారికి ఆశ్రయమిచ్చే హోటళ్లపై తమ డ్రోన్లు దాడి చేస్తాయని స్పష్టం చేశారు. ఈ దాడులకు ఆయా హోటళ్ల యాజమాన్యాలే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.






