Latest News
ఇరాన్ దెబ్బకు ప్రపంచ దేశాలకు చమురు సెగ
posted on: Mar 13, 2026 1:01PM

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం మొత్తం ప్రపంచంపై పడుతోంది. ముఖ్యంగా ప్రపంచ చమురు మార్కెట్పై తీవ్రాతితీవ్రమైన ప్రభావం కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా చమురు ధరలు అంతర్జాతీయ విఫణిలో భగ్గుమంటున్నాయి. ఇరాన్ చర్యల కారణంగా ప్రపంచానికి అత్యంత కీలకమైన సముద్ర మార్గం అయిన హోర్ముజ్ జలసంధి వద్ద రవాణాకు అనువైన పరిస్థితులు లేకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ధరలు పెరగడం మాత్రమే కాకుండా అసలు సరఫరాయే నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది.
హోర్ముజ్ జలసంధి ప్రపంచ ఇంధన సరఫరాలో అత్యంత కీలక పాత్ర పోషిస్తుందన్న సంగతి తెలిసిందే. గల్ఫ్ ప్రాంతంలోని సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్ వంటి దేశాల నుంచి ప్రపంచ మార్కెట్లకు వెళ్లే చమురు, సహజవాయువు ప్రధానంగా ఈ మార్గం ద్వారానే రవాణా అవుతుంది. ప్రపంచంలో వినియోగించే మొత్తం చమురులో దాదాపు 20శాతం సరఫరా ఈ మార్గం ద్వారా జరుగుతుంది.అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మార్గం దాదాపు మూసుకుపోయింది. ఇరాన్ తమ దేశంపై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ప్రకటించిన యుద్ధానికి ప్రతీకారంగా
హోర్ముజ్ జలసంధి మార్గంలో తన నావికాదళ కార్యకలాపాలను ముమ్మరం చేసింది. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయిల్ ట్యాంకర్లు ఈ మార్గంలో ప్రయాణించేందుకు అవకాశం లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో షిప్పింగ్ కంపెనీలు తమ నౌకలను తాత్కాలికంగా నిలిపివేశాయి.
ఈ కారణంగా ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఆకాశానికి అంటాయి. ఈ సరఫరా అంతరాయం ఇలాగే కొనసాగితే చమురు ధరలు మరింత పెరగడం అనివార్యం. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయం.
హోర్ముజ్ జలసంధి వద్ద భద్రతను బలోపేతం చేయడానికి అమెరికా, యూరోపియన్ దేశాలు చర్యలు చేపడుతున్నాయి. సముద్ర మార్గం సురక్షితంగా ఉండేలా అంతర్జాతీయ స్థాయిలో చర్చలు సైతం సాగుతున్నాయి. అలాగే చమురు సరఫరాలో అంతరాయం కలగకుండా ఉండేందుకు గల్ఫ్ దేశాలు ప్రత్యామ్నాయ మార్గాలపై కూడా దృష్టి సారిస్తున్నాయి. అయినప్పటికీ హోర్ముజ్ జలసంధి వద్ద పరిస్థితులు కుదుటపడకపోతే మాత్రం పరిస్థితి అత్యంత భయానకంగా, దయనీయంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చమురు సరఫరాలో అంతరాయం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలనూ ఆర్థిక సంక్షోభంలో కూరుకునేలా చేయడం తథ్యమని చెబుతున్నారు.


.webp)



