Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నాన్నా పులి కథలా ఇరాన్, అమెరికా శాంతి చర్చలు!
posted on: Jun 29, 2026 3:17PM

అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిన తర్వాత కూడా ఇరు దేశాల మధ్య దాడులు, ఉద్రిక్తతలు సడలడం లేదు. పదే పదే శాంతి ఒప్పంద ప్రకటనలు, కాల్పుల విరమణ ఒప్పందాలతో ఇరాన్, అమెరికాల మధ్య శాంతి ఒప్పందం వార్తలపై ప్రపంచం నమ్మకం సడలిపోతోంది. ఈ వ్యవహారం అంతా నాన్నా పులి కథలా ఉందన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. తాజాగా.. ఇరాన్పై అమెరికా దాడి చేసింది. దీంతో ఇరాన్ అమెరికా అనుకూల దేశాలపై ప్రతీకార దాడులు చేపట్టింది. ఈ క్రమంలో పనామా జెండా ఎగురవేస్తున్న కికు అనే చమురు నౌకపై డ్రోన్ దాడి జరిగింది. ఆ నౌకలో సుమారు రెండు మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు ఉండగా, సిబ్బంది ఎవరికీ హాని కలగలేదు. ఈ ఘటన తర్వాత అమెరికా సెంట్రల్ కమాండ్ ఇరాన్లోని పది ముఖ్యమైన సైనిక లక్ష్యాలపై వైమానిక దాడులు చేసింది.
నిఘా వ్యవస్థలు, సమాచార మార్పిడి నెట్వర్కులు, వైమానిక రక్షణ కేంద్రాలు, డ్రోన్ల నిల్వ స్థావరాలు, సముద్రంలో గనులు పరవడం వంటి సామర్థ్యాలపై అమెరికా దాడులు జరిపింది. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఇరాన్ మళ్లీ దాడులకు దిగిందని అమెరికా ఆరోపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు హెచ్చరికలు జారీ చేశారు. కాల్పుల విరమణను ఇరాన్ పదేపదే ఉల్లంఘిస్తోందని విమర్శలు గుప్పించిన ఆయన, ఇదే పరిస్థితి కొనసాగితే.. పూర్తి స్థాయి యుద్ధం ద్వారా ఇరాన్ చాప్టర్ ను క్లోజ్ చేస్తామని హెచ్చరించారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఖ్చీ హర్ముజ్ జలసంధిపై తమ పూర్తి నియంత్రణ ఉందని పునరుద్ఘాటంచారు. నియమాలు ఉల్లంఘించే నౌకలు సమస్యలకు కారణమవుతాయని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. అదే సమయంలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ నేవీ కమాండర్ గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలు త్వరలోనే సమస్యలను ఎదుర్కొంటాయని హెచ్చరించారు.
అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కువైట్లోని అలీ అల్ సలేం ఎయిర్ బేస్, బహ్రెయిన్లోని అమెరికా ఐదో నౌకాదళ స్థావరంపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్లు ప్రకటించింది. కువైట్ సైన్యం తమ వైమానిక రక్షణ వ్యవస్థలు ఆ దాడులను విజయవంతంగా తిప్పికొట్టాయని తెలిపింది. గల్ఫ్ దేశాల్లో సైరన్లు మోగడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.
తీవ్ర సైనిక ఉద్రికతల మధ్య కూడా శాంతి చర్చల యత్నాలు కొనసాగుతున్నాయి. స్విట్జర్లాండ్లో జరిగిన అవగాహన ఒప్పందం తర్వాత 60 రోజుల వ్యవధిలోనే దాడులు మళ్లీ మొదలవడంతో చర్చలు నిలిచిపోయాయి. అయితే ఖతార్, పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో అమెరికా, ఇరాన్ ప్రతినిధులు మళ్లీ చర్చలకు సిద్ధమయ్యారు. ఈ వారంలోనే దోహాలో హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలు, సముద్ర భద్రత, కాల్పుల విరమణ అమలుపై చర్చలు జరపనున్నట్లు సమాచారం. ఈ చర్చలు ఫలితాలిస్తే ప్రాంతంలో యుద్ధ ముప్పు కొంత తగ్గే అవకాశం ఉంది.






