Latest News
ఐపీఎల్ 2026 : పంత్ బ్యాటింగ్ ఆర్డర్లో మార్పు...లక్నో కొత్త వ్యూహం
posted on: Mar 23, 2026 3:18PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ సమీపిస్తున్న తరుణంలో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తమ వ్యూహాలకు పదును పెడుతోంది. గత సీజన్లో ఎదురైన వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకున్న మేనేజ్మెంట్, ఈసారి ప్రధానంగా జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ బ్యాటింగ్ స్థానంపై ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. రానున్న టోర్నీలో పంత్ మూడో స్థానంలో (వన్డౌన్) బ్యాటింగ్కు రానున్నట్లు తెలుస్తోంది.
గత ఏడాది రిషబ్ పంత్ను వివిధ స్థానాల్లో ఆడించడం జట్టుపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. కొన్ని మ్యాచ్ల్లో ఓపెనర్గా, మరికొన్ని మ్యాచుల్లో ఏడో స్థానంలో పంపడం వల్ల అతను తన సహజ సిద్ధమైన ఆటను ప్రదర్శించలేకపోయాడు. బెంగళూరుతో జరిగిన ఒక మ్యాచ్లో సెంచరీ సాధించినప్పటికీ, మిగిలిన సీజన్ అంతా పంత్ కేవలం 13.73 సగటుతో 151 పరుగులు మాత్రమే చేయగలిగారు. ఈ అస్థిరత జట్టు ఫలితాలపై కూడా ప్రభావం చూపింది.
ఈ నేపథ్యంలోనే లక్నో చీఫ్ కోచ్ జస్టిన్ లాంగర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పంత్ శైలికి మూడో స్థానమే అత్యంత అనువైనదని ఆయన భావిస్తున్నారు. పవర్ ప్లే ముగిసే సమయంలో లేదా వికెట్ పడిన వెంటనే పంత్ క్రీజులోకి వస్తే, ఇన్నింగ్స్ను నిర్మించడంతో పాటు స్కోరు బోర్డును పరుగులు పెట్టించగలరని కోచ్ నమ్మకం.
ఈ సీజన్లో లక్నో ఓపెనర్లుగా ఐడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్ బరిలోకి దిగే అవకాశం ఉంది. వీరు శుభారంభం ఇస్తే, వన్డౌన్లో వచ్చే పంత్ ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే అవకాశం ఉంటుంది. ఇక గత సీజన్లో మూడో స్థానంలో ఆడిన నికోలస్ పూరన్, ఈసారి నాలుగో స్థానానికి పరిమితం కానున్నట్లు సమాచారం.
ఈ మార్పుల ద్వారా మిడిల్ ఆర్డర్ను మరింత పటిష్టం చేయాలని లక్నో భావిస్తోంది. రిషబ్ పంత్ తన ఫామ్ను తిరిగి పుంజుకుని, జట్టును ప్లేఆఫ్స్ దిశగా నడిపిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. ముఖ్యంగా పంత్ వంటి విధ్వంసకర ఆటగాడు టాప్ ఆర్డర్లో ఎక్కువ ఓవర్లు ఆడితే భారీ స్కోర్లు ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.






