భాగస్వామ్య సదస్సుకు ముందే ఏపీకి పెట్టుబడుల వరద
posted on Nov 13, 2025 9:44PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల వరద పోటెత్తుతోంది. శుక్రవారం (నవంబర్ 14) నుంచి రెండు రోజుల పాటు విశాఖలో సిఐఐ భాగస్వామ్య సదస్సు జరగనుండగా, అందుకు ఒక రోజు ముందే అంటే గురువారం (నవంబర్ 13) దాదాపు 35 సంస్థలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఓప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందాల ద్వారా రాష్ట్రానికి దాదాపు మూడులక్షల 66 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. అలాగే ఈ ఒప్పందాల ద్వారా రాష్ట్రంలో నెలకొల్పనున్న పరిశ్రమలలో దాదాపు లక్షా 26 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సమక్షంలో ఈ ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందాల మేరకు ఏబీసీ క్లీన్టెక్ & ఆక్సిస్ ఎనర్జీ వెంచర్స్ సంస్థ రాష్ట్రంలో 1,10,250 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయనుంది. అలాగే 13,500 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.
అలాగే రీన్యూ పవర్ కంపెనీ పాతిక వేల రూపాయల పెట్టుబడితో ముందుకు వచ్చేందుకు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా పది వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలున్నాయి. రీన్యూ ఇ-ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 17 వేల కోట్ల రూపాయల పెట్టుబడి తో సంస్థను ఏర్పాటు చేయానికి అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. దీని ద్వారా 11 మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ఇక రీన్యూ ప్రైవేట్ లిమిటెడ్-రూ 12500 కోట్ల రూపాయలు, 3250 మందికి ఉద్యోగ అవకాశాలు, నవయుగ ఇంజనీరింగ్ 2, 427 కోట్ల రూపాయల ఇన్వెస్ట్ మెంట్, 6300 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు ఏపీ సర్కార్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇంకా చింతా గ్రీన్ ఎనర్జీ, ఫోర్ స్క్వేర్ గ్రీన్ ఎనర్జీ, ఇండోసోల్, షిర్డీ సాయి సంస్థలు కూడా ఎనర్జీ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి.
అలాగే, వైజాగ్ ప్రొఫైల్స్ లాజిస్టిక్స్, స్టీల్ ఎక్స్చేంజ్ ఇండియా, విరూపాక్ష ఆర్గానిక్స్, అనంత్ టెక్నాలజీస్, ఏటీఆర్ వేర్ హౌసింగ్, లారస్ ల్యాబ్స్, మారుతి ఇస్పాత్ అండ్ పైప్స్ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్, మల్లాది ఫార్మా సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చి ఏపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
ఇంకా ఈజౌల్, కోరమండల్, తైవాన్ ప్రైవేట్ ఇండస్ట్రీయల్ పార్క్స్ జూల్, మణిపాల్ గ్రూప్, బెర్జాయ గ్రూప్, అమరావతి లైఫ్ సైన్సెస్, మైసిటీ, వివెన్స్ గ్రూప్, ఫ్యాషన్ ఎంటర్ ప్రెన్యూయర్ ఫండ్, ఏస్ అర్బన్ డెవలర్స్, క్రౌన్ ఎల్ఎన్జీ, ఆర్సీఆర్టీ కూడా రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి.అదే విధంగా ఉమెన్ ఓవా అగ్రో ఫుడ్ పార్క్, ఐటీసీ ఫుడ్స్, గాడ్రేజ్ అగ్రో వెట్, బిస్లరీ సంస్థలు కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.