Latest News

ఇండిగో సీఈవో రాజీనామా

posted on: Mar 10, 2026 9:36PM

 

భారతదేశంలోని అతిపెద్ద ఎయిర్‌లైన్స్‌లలో ఒకటైన ఇండిగోలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సంస్థ సీఈఓగా ఉన్న పీటర్ ఎల్బర్స్ తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ రాజీనామాను సంస్థ బోర్డు ఆమోదించినట్లు ఇండిగో వర్గాలు ప్రకటించాయి.

ఇండిగో ప్రకటన ప్రకారం పీటర్ ఎల్బర్స్ రాజీనామా తక్షణమే అమల్లోకి రానుంది. ఆయన స్థానంలో సంస్థ ఎండీ అయిన రాహుల్ భాటియా తాత్కాలికంగా సీఈఓ బాధ్యతలు స్వీకరించనున్నారు. కొత్త సీఈఓ నియామకం వరకు ఆయన ఈ బాధ్యతలు నిర్వహించే అవకాశం ఉంది.

2022 సంవత్సరం నుంచి ఇండిగో సీఈఓగా పీటర్ ఎల్బర్స్ పనిచేస్తున్నారు. ఆయన నాయకత్వంలో సంస్థ విస్తరణ, కొత్త మార్గాల ప్రారంభం వంటి చర్యలు చేపట్టినప్పటికీ ఇటీవల కొన్ని సమస్యలు సంస్థను ఇబ్బందుల్లోకి నెట్టాయి. ముఖ్యంగా గత డిసెంబర్‌లో ఇండిగోకు చెందిన 2,500కు పైగా విమానాలు రద్దు కావడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ప్రయాణికులు భారీగా ఇబ్బందులు పడటంతో ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్‌గా స్పందించింది. సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కోలేదన్న కారణంతో జనవరిలో ఇండిగోపై సుమారు రూ.22 కోట్ల జరిమానా విధించింది. ఈ పరిణామాల నేపథ్యంలో పీటర్ ఎల్బర్స్ రాజీనామా చేయడం విమానయాన రంగంలో చర్చకు దారితీస్తోంది. ఇండిగో భవిష్యత్ వ్యూహాలు, సంస్థలో నాయకత్వ మార్పులు ఎలా ఉండబోతాయన్నది ఇప్పుడు పరిశ్రమలో ఆసక్తిగా మారింది.కాగా, సీఈఓ రాజీనామా వార్తల నేపథ్యంలో ఇండిగో షేర్లు ఎన్ఎస్ఈలో 3.46 శాతం పెరిగి రూ.4,383.50 వద్ద ముగియడం విశేషం. పూర్తిస్థాయి సీఈఓ కోసం అన్వేషణ ప్రారంభించినట్లు సంస్థ తెలిపింది.


 

google-ad-img
    Related Sigment News
    • Loading...