హాకీలో పాకిస్థాన్‌ను ఊచకోత కోసిన భారత్.. 7-1తో ఊహించని రికార్డు!

posted on: Jun 27, 2026 10:12AM

క్రీడా ప్రపంచంలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అంటేనే అదొక హై-వోల్టేజ్ డ్రామా. మైదానంలో ఇరు జట్ల ఆటగాళ్లు గెలవడమే లక్ష్యంగా ప్రాణం పెట్టి ఆడుతుంటారు. క్రికెట్ మైదానంలోనే కాదు, జాతీయ క్రీడ హాకీలోనూ ఈ దాయాదుల పోరు నరాలు తెగే ఉత్కంఠను రేకెత్తిస్తుంది. అయితే, లండన్ వేదికగా జరిగిన ఎఫ్‌ఐహెచ్ ప్రో లీగ్‌ (FIH Pro League)లో మాత్రం టీమిండియా వన్ సైడ్ లవ్‌లా మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేసింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను 7-1 గోల్స్ తేడాతో చిత్తుచిత్తుగా ఓడించి, మైదానంలో భారత పురుషుల హాకీ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. లండన్‌లోని లీ వ్యాలీ హాకీ అండ్ టెన్నిస్ సెంటర్‌లో జరిగిన ఈ పోరులో భారత్ ఆడిన ఆట తీరు, వ్యూహాలు ప్రత్యర్థికి చుక్కలు చూపించాయి.

మ్యాచ్ ప్రారంభమైన తొలి క్వార్టర్‌లో భారత్‌కు కాస్త గట్టి పోటీ ఎదురైంది. ఆట మొదలైన కేవలం 90 సెకన్లలోనే భారత జట్టుకు పెనాల్టీ కార్నర్ లభించినప్పటికీ, దానిని గోల్‌గా మార్చడంలో మన ఆటగాళ్లు విఫలమయ్యారు. ఇదే తరుణంలో మ్యాచ్ 13వ నిమిషంలో లభించిన సువర్ణావకాశాన్ని పాకిస్థాన్ సద్వినియోగం చేసుకుంది. పాక్ కెప్టెన్ అబూ బకర్ మహ్మద్ అద్భుతమైన పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచాడు. దీంతో తొలి క్వార్టర్ ముగిసే సమయానికి పాకిస్థాన్ 1-0 ఆధిక్యంలో నిలిచి, మ్యాచ్‌పై పట్టు సాధించినట్లు కనిపించింది. కానీ అసలు సినిమా రెండో క్వార్టర్ నుంచి మొదలైంది.

రెండో క్వార్టర్‌లో భారత జట్టు ఒక్కసారిగా గేర్ మార్చింది. ప్రత్యర్థిపై దాడిని ముమ్మరం చేస్తూ పక్కా వ్యూహంతో ముందుకు సాగింది. మ్యాచ్ 20వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ వేగంగా కొట్టగా, అక్కడే పొంచి ఉన్న సుఖ్‌జీత్ సింగ్ ఎంతో చాకచక్యంగా డిఫ్లెక్ట్ చేసి బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపాడు. దీంతో భారత్ స్కోరు 1-1తో సమమైంది. ఆ తర్వాత 26వ నిమిషంలో లభించిన మరో పెనాల్టీ కార్నర్‌ను కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ తన మార్క్ డ్రాగ్ ఫ్లిక్‌తో బుల్లెట్‌లా దూసుకెళ్లే గోల్‌గా మలిచాడు. ఈ గోల్‌తో హాఫ్‌టైమ్ సమయానికి భారత్ 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లి, మ్యాచ్‌ను పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకుంది.

ద్వితీయార్ధంలో భారత్ హవా మరింత పెరిగింది. పాకిస్థాన్ రక్షణ శ్రేణిని చేధిస్తూ భారత ఆటగాళ్లు గోల్స్ వర్షం కురిపించారు. పెనాల్టీ స్ట్రోక్‌ను హార్దిక్ సింగ్ అలవోకగా గోల్‌గా మార్చగా, ఆ వెంటనే జుగ్‌రాజ్ సింగ్ సాధించిన అద్భుతమైన గోల్‌తో స్కోరు 4-1కి చేరింది. మ్యాచ్ 41వ నిమిషంలో సుఖ్‌జీత్ సింగ్ అందించిన అద్భుతమైన పాస్‌ను అభిషేక్ మెరుపు వేగంతో గోల్‌గా మలిచి ఆధిక్యాన్ని 5-1కి పెంచాడు. ఆ తర్వాత రాజ్ కుమార్ పాల్ ప్రత్యర్థి డిఫెన్స్‌ను చీల్చుకుంటూ మరో గోల్ సాధించాడు.

చివరి క్వార్టర్‌లోనూ భారత్ దూకుడు అస్సలు తగ్గలేదు. మ్యాచ్ 54వ నిమిషంలో దిల్‌ప్రీత్ సింగ్ కొట్టిన గోల్‌తో భారత్ 7-1తో తిరుగులేని విజయాన్ని ఖరారు చేసుకుంది. ఈ చారిత్రాత్మక మ్యాచ్‌లో భారత్ తరఫున సుఖ్‌జీత్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్, జుగ్‌రాజ్ సింగ్, అభిషేక్, రాజ్ కుమార్ పాల్, దిల్‌ప్రీత్ సింగ్ చెరో ఒక గోల్ సాధించి సమష్టిగా పాక్‌ను దెబ్బకొట్టారు. మిడ్‌ఫీల్డ్‌లో అద్భుత ప్రదర్శనతో పాక్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన హార్దిక్ సింగ్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. ఈ విజయంతో భారత్ పూర్తి మూడు పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. గత పదేళ్ల కాలంలో పాకిస్థాన్‌పై భారత్ 17-0తో వరుస విజయాల ఆధిక్యంలో కొనసాగుతూ హాకీలో తన తిరుగులేని సామ్రాజ్యాన్ని నిరూపించుకుంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...