Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...చమురు తుపానులోనూ తగ్గని భారత్ వృద్ధి!
posted on: Apr 21, 2026 9:35AM
.webp)
ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తుతున్నా.. భారత ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని ప్రదర్శిస్తోంది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు, ఇంధన ధరల పెరుగుదల, అమెరికా వంటి అగ్రరాజ్యాల్లో సైతం కనిపిస్తున్న ఆర్థిక మందగమనం వంటి సవాళ్లు ఉన్నప్పటికీ, భారత్ మాత్రం తన వృద్ధిని నిలకడగా కొనసాగిస్తోంది. తాజాగా విడుదలైన ఎస్బీఐ (SBI) అధ్యయన నివేదిక ప్రకారం.. 2027 ఆర్థిక సంవత్సరం నాటికి దేశీయ జిడిపి వృద్ధి రేటు 6.8 నుంచి 7.1 శాతం వరకూ ఉంటుంది. భారత ఆర్థిక వ్యవస్థ ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ స్థిరంగా, పటిష్ఠంగా నిలబడటానికి ప్రధాన కారణం దేశంలోని ధృఢమైన అంతర్గత పునాదులే. దేశీయంగా పెరిగిన వినియోగం, పటిష్టమైన బ్యాంకింగ్ రంగం, గత కొన్ని సంవత్సరాలుగా కార్పొరేట్ సంస్థల బ్యాలెన్స్ షీట్లు మెరుగుపడటం భారత్కు పెద్ద ప్లస్ పాయింట్గా మారాయి. 2 026 ఆర్థిక సంవత్సరంలో 7.6 శాతం వృద్ధిని సాధించిన తరువాత కూడా.. ఇండియాకు అంతర్జాతీయ అనిశ్చితిని తట్టుకోగల సత్తా ఉందని ఈ నివేదిక స్పష్టం చేస్తున్నది.
అయినప్పటికీ, ముడిచమురు ధరల పెరుగుదల అనేది భారత్కు తక్షణ ముప్పుగా పరిణమించే అవకాశం ఉంది. ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా ప్రకారం.. ఒకవేళ అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ చమురు ధర 130 డాలర్లకు చేరితే, అది భారత వృద్ధి రేటుపై 0.8 శాతం వరకు ప్రభావం చూపవచ్చు. అదే అంతర్జాాతీయ మార్కెట్ లో బ్యారెల్ చమురు ధర 140 డాలర్లను దాటితే.. ద్రవ్యోల్బణం పెరగడమే కాకుండా కరెంట్ అకౌంట్ లోటు, కంపెనీల లాభాలపై తీవ్ర ఒత్తిడి పడే అవకాశం ఉంది. ఇది రవాణా, ఎరువులు, తయారీ, విమానయాన రంగాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది.
గతంలో చమురు ధరలు పెరిగిన ప్రతిసారీ అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్లడం మనం చూశాం. అయితే ఈసారి అమెరికా పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. ఇందుకు ప్రధాన కారణం ఆ దేశం ప్రస్తుతం ఇంధన ఎగుమతిదారుగా ఎదగడమే. అయినా కూడా పెరిగిన ధరలు అక్కడి వినియోగదారులపై భారాన్ని పెంచుతాయనడంలో సందేహం లేదు. అంతర్జాతీయ సరఫరా గొలుసుల్లో వచ్చే మార్పులు ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. ప్రస్తుత తరుణంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పాత్ర అత్యంత కీలకంగా మారింది. ఒకవైపు వృద్ధిని కాపాడుకుంటూనే, మరోవైపు పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడం ఆర్బీఐ ముందున్న ప్రధాన సవాలు. రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణం 4.5 శాతం వద్ద, ద్రవ్యలోటు 4.5 నుంచి 4.6 శాతం మధ్య ఉండొచ్చని అంచనా. రూపాయి విలువ పడిపోకుండా స్థిరత్వాన్ని కొనసాగించడం కూడా ఈ సమయంలో ఎంతో అవసరం.
సంక్షోభ సమయాల్లో కూడా కొన్ని కొత్త అవకాశాలు పుట్టుకొస్తుంటాయి. మధ్యప్రాచ్యంలోని దుబాయ్, అబుదాబి వంటి ఆర్థిక కేంద్రాలు ఒత్తిడికి లోనవుతుంటే.. ఆ పెట్టుబడులను ఆకర్షించడానికి గుజరాత్లోని గిఫ్ట్ సిటీ (గిఫ్ట్ సిటీ) వంటి వేదికలు భారత్కు సిద్ధంగా ఉన్నాయి. అదేవిధంగా, అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు సంబంధించి భారత విమానాశ్రయాలు ప్రత్యామ్నాయ ట్రాన్సిట్ హబ్లుగా మారే అవకాశం ఉంది. అయితే ఇందుకు మౌలిక సదుపాయాలను మరింత ఆధునీకరించాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో చమురు ధరల ప్రభావం వ్యవసాయం, చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై ఎక్కువగా ఉంటుంది. సాగు ఖర్చులు పెరగడం వల్ల రైతులపై భారం పడవచ్చు. అయినప్పటికీ, భారత్లో ఉన్న భారీ దేశీయ మార్కెట్ ఈ షాక్లను తట్టుకుని నిలబడే శక్తిని ఇస్తోంది. అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గుతున్నా.. మన అంతర్గత డిమాండ్ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపిస్తోంది. , ప్రపంచ చమురు తుఫాను భారత్కు ఒక పరీక్ష వంటిదే. అందులో సందేహం లేదు. ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ, మారుతున్న అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా త్వరితగతిన స్పందించడం ద్వారా భారత్ తన వృద్ధిని సుస్థిరం చేసుకోవచ్చు. ఎస్బీఐ అంచనాల ప్రకారం 2027 నాటికి భారత్ తన బలమైన బ్యాంకింగ్, విధానపరమైన నిర్ణయాలతో ప్రపంచ ఆర్థిక పటంలో తన ప్రత్యేకతను చాటుకుంటుంది.
- సీతారాం కంఠంనేని






