మన సంస్కృతి.. విశ్వవ్యాప్త ఖ్యాతి.. విదేశీయులను కట్టిపడుస్తున్న భారత జీవన విధానం

posted on: May 23, 2026 6:12PM

భారతదేశానికి ఉన్న అతిపెద్ద బలం ఇక్కడి వైవిధ్యభరితమైన సాంస్కృతిక పునాది. శతాబ్దాల చరిత్ర కలిగిన భారత జీవన విధానం, సాంప్రదాయాలు తరచుగా ప్రపంచవ్యాప్తంగా ఎందరినో ఆకర్షిస్తూనే ఉంటాయి. తాజాగా..  మనదేశంలో నివసిస్తున్న లిథువేనియా దేశానికి చెందిన మోనికా కుండ్జ్ దాస్ అనే మహిళ భారతీయ జీవనశైలిని ఉద్దేశించి చేసిన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు   సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. ఆధునికత వైపు పరుగులు తీస్తున్న పశ్చిమ దేశాల సమాజంలో క్రమంగా అంతరించిపోతున్న మానవీయ విలువలు, సామాజిక బంధాలు భారతదేశంలో ఏ విధంగా పటిష్టంగా ఉన్నాయో ఆమె తన విశ్లేషణ ద్వారా ప్రపంచానికి వివరించారు.  మోనికా ప్రధానంగా భారత సంస్కృతిలోని ఐదు కీలకమైన అంశాలను ప్రస్తావించారు.  వీటిని పాశ్చాత్య దేశాలు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అందులో మొదటిది మన సంప్రదాయంలో భాగమైన  అతిథి దేవో భవ  అనే సూత్రం. మన ఇంటికి వచ్చే పర్యటకులు లేదా బంధువులను కేవలం మర్యాదపూర్వకంగా పలకరించడమే కాకుండా..  వారిని దైవ సమానులుగా భావించి, ఆత్మీయంగా ఆహ్వానించే తీరు ఆమెను ఎంతగానో ఆకట్టుకుంది. ఎదుటివారికి ప్రేమతో కాఫీ, టీ లేదా భోజనం  పెట్టి తమ కుటుంబంలో ఒకరిగా చూసుకునే ఈ పద్ధతి కేవలం ఒక అలవాటు మాత్రమే కాదనీ..  అది సమాజాల మధ్య నమ్మకాన్ని, బంధాన్ని పెంచే ఒక అద్భుతమైన సాధనమని మోనికా కుండ్జ్ దాస్  కొనియాడారు. నేటి వేగవంతమైన ప్రపంచంలో.. ముఖ్యంగా పశ్చిమ దేశాల్లో వ్యక్తిగత స్వేచ్ఛ పేరిట ఇలాంటి ఆతిథ్య సంస్కృతి బలహీనపడుతున్న తరుణంలో..  భారతీయులు దీనిని కాపాడుకోవడం విశేషమన్నారు.  

ఆమె ప్రస్తావించిన రెండవ ముఖ్య అంశం, ఇండియాలోని సామూహిక జీవన విధానం. ఐరోపా వంటి పాశ్చాత్య ప్రాంతాల్లో సమాజం ఎక్కువగా వ్యక్తిగత ప్రయోజనాలకు, ఒంటరితనానికి ప్రాధాన్యత ఇస్తుంటే, ఇండియాలో  మాత్రం ఉమ్మడి కుటుంబాలు, ఇరుగుపొరుగువారి మధ్య ఉండే అవినాభావ సంబంధాలు ఒక పటిష్టమైన సామాజిక వ్యవస్థను నిర్మించాయని పేర్కొన్నారు. కష్టసుఖాలలో ఒకరికొకరు తోడుగా నిలవడం, సమాజంలో ఒకరిపై ఒకరు ఆధారపడుతూ జీవించడం అనేది ఇక్కడి ప్రజల నరనరాల్లో జీవన విధానంగా పాతుకుపోయిందని వివరించారు. కాలంతో పాటు నగరాల్లో ఈ బంధాలు కొద్దిగా మారుతున్నప్పటికీ..  ఇప్పటికీ గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ఈ సామాజిక సామూహిక తత్వం ఒక మూలధనంలా  పదిలంగా ఉందని మోనికా పేర్కొన్నారు.  

ఇక మూడవ అంశంగా ఇళ్లలో వండే సాంప్రదాయ భోజన ప్రాముఖ్యతను ఆమె హైలైట్ చేశారు. పశ్చిమ దేశాలలో ఉపాధి, వ్యాపారాల ఒత్తిడి కారణంగా రెడీగా దొరికే జంక్ ఫుడ్ లేదా బయటి ఆహార సంస్కృతి పెరిగిపోయిందని.. అందరూ విడివిడిగా ఎవరికి వారుగా భుజించే అలవాటు ఎక్కువైందని ఆమె గుర్తుచేశారు. కానీఇేడాయాలో లో ఇప్పటికీ ఒకే టేబుల్ లేదా ఒకే చోట కూర్చుని కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేయడం ఒక నిశ్శబ్ద విప్లవంగా  ఆమె అభివర్ణించారు. ఈ ఉమ్మడి భోజన సమయం కేవలం ఆకలిని తీర్చుకోవడానికే కాకుండా..  రోజంతా జరిగిన విషయాలను పంచుకోవడానికి, ఒకరిపై ఒకరు ఆప్యాయతను కురిపించడానికి ఒక గొప్ప వేదికగా మారుతుందని ఆమె విశ్లేషించారు. భారతీయ వంటకాల వెనుక కేవలం మసాలాల రుచి మాత్రమే కాకుండా, అమ్మ ప్రేమ, కుటుంబ జ్ఞాపకాలు దాగి ఉన్నాయని ఆమె భావోద్వేగంగా పేర్కొన్నారు.  

అదేవిధంగా, పరిశుభ్రత పట్ల భారతీయులకు ఉన్న శ్రద్ధను ఆమె నాల్గవ అంశంగా గుర్తించారు. సాధారణంగా విదేశీయులు భారతదేశంలోని ప్రజా బాహ్య ప్రదేశాల గురించి భిన్నంగా మాట్లాడుతుంటారు..  కానీ మోనికా మాత్రం ఇక్కడి ప్రజల అంతర్గత,  పరిసరాల శుభ్రత వెనుక ఉన్న సామాజిక బాధ్యతను లోతుగా పరిశీలించారు. భారతీయులు తమ దేహాన్ని శుద్ధి చేసుకోవడంతో పాటు, తమ పూజా గదులను, ఇళ్లను, ముంగిలిని నిత్యం శుభ్రంగా ఉంచుకోవడాన్ని ఒక నైతిక విధిగా భావిస్తారని తెలిపారు. ఇతరుల పట్ల గౌరవం చూపడానికి, తాము నివసించే ప్రదేశాన్ని పవిత్రంగా చూసుకోవడానికి పరిశుభ్రతను ఒక సాధనంగా మలచుకున్నారన్నమోనికా కుండ్జ్ దాస్  పట్టణీకరణ వల్ల కొన్ని చోట్ల ఇబ్బందులు ఉన్నప్పటికీ, దేశవ్యాప్తంగా ఈ సంస్కృతి నేటికీ బలంగా, స్ధిరేగా కొనసాగుతోందని ఆమె పేర్కొన్నిరు. 

 చివరగా ఐదో అంశంగా ఇండియాలో కనిపించే నిరంతర ఉత్సాహం మరియు జీవనోత్సవం గురించి ఆమె అద్భుతమైన విశ్లేషణ చేశారు. పాశ్చాత్య దేశాలలో జీవితం చాలావరకు ఒక క్రమశిక్షణతో కూడిన పట్టికలా, కాస్త గంభీరంగా సాగుతుందనీ, అదే  ఇండియాలో మాత్రం ఎలాంటి ప్రత్యేక కారణం లేకపోయినా నిత్య జీవితాన్ని ఒక పండుగలా మార్చుకుంటారని  కొనియాడారు. చిన్న చిన్న సందర్భాలు, వీధి పండుగలు, ఆకస్మిక బంధువుల రాక, సంగీతం, పిచ్చాపాటి సంభాషణలు వంటివన్నీ ఇక్కడి ప్రజలకు రోజువారీ సంతోషాన్ని ఇస్తాయని వివరించారు. జీవితాన్ని ఉన్నదున్నట్లుగా ఆస్వాదిస్తూ, ప్రతి క్షణాన్ని వేడుకలా మార్చుకునే ఈ భారతీయ దృక్పథం ఒక గొప్ప జీవన కళ అని  మోనికా కుండ్జ్ దాస్ శ్లాఘించారు.  మోనికా చేసిన ఈ వ్యాఖ్యలు  ఒక విదేశీయురాలి కోణంలో మన నిత్య జీవితంలోని అపురూపమైన విలువలు మళ్లీ వెలుగులోకి రావడం వల్ల సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయ్యాయంటే.  మనం రోజూ చూస్తూ,  పెద్దగా ప్రాధాన్యత ఇవ్వని చిన్న చిన్న విషయాల వెనుక ఎంతటి గొప్ప తత్వశాస్త్రం ఉందో ఒక విదేశీ వనిత గుర్తుచేయడం భారతీయుల్లో ఆత్మగౌరవాన్ని పెంపొందించింది. అయితే, పశ్చిమ దేశాలన్నీ ఒకేలా ఉండవని, అలాగే భారతదేశంలోని ప్రతి ప్రాంతం ఏకరూపంగా ఉండదని గ్రహిస్తూనే..  ఆమె చెప్పిన అంతరార్థాన్ని  స్వీకరించాల్సి ఉంటుంది. గ్లోబలైజేషన్ మరియు డిజిటల్ యుగంలో పని ఒత్తిడి కారణంగా మన విలువలు కూడా మారుతున్న తరుణంలో, ఈ సాంస్కృతిక మూలాలను కాపాడుకోవడం మన సామాజిక బాధ్యత అని ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది. 

-సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.    

google-ad-img
    Related Sigment News
    • Loading...