Latest News

భారత్ వరల్డ్ కప్ విజయాల్లో ఆసక్తికర సెంటిమెంట్!

posted on: Mar 9, 2026 8:31PM

 

సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత జట్టు టీ20 ప్రపంచ కప్2026ను కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన తుదిపోరులో న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. దీంతో టీ20 ఫార్మాట్‌లో ముచ్చటగా మూడోసారి టైటిల్‌ను అందుకుంది. రెండు వన్డే, మూడు టీ20లు కలిపి మొత్తంగా ఐదు ప్రపంచ కప్‌లను భారత్ తన ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలో టీమిండియా ప్రపంచ కప్ విజయాల వెనక ఉన్న ఓ ఇంట్రస్టింగ్ విషయం వైరల్ అవుతోంది. 

1983లో భారత్ జట్టు తొలిసారి వన్డే ప్రపంచ కప్‌ను ముద్దాడింది. తాజాగా టీ20 ప్రపంచ కప్ 2026ను కైవసం చేసుకుంది. 1983 నుంచి తాజాగా టీ20 వరల్డ్ కప్2026 వరకు భారత్ గెలిచిన ప్రతి వరల్డ్ కప్‌లో తప్పనిసరిగా ఒక సర్ధార్, ఒక కేరళ ఆటగాడు జట్టులో భాగమయ్యారు. వారు లేకుండా ఇప్పటి వరకు భారత్ ఒక్క ప్రపంచ కప్ కూడా గెలవకపోవడం విశేషం.1983లో సర్దార్ బల్విందర్ సంధూ , కేరళ ఆటగాడు సునీల్ వాల్సన్‌లతో ఈ సెంటిమెంట్ మొదలైంది. 2007 (టీ20), 2011 (వన్డే) ప్రపంచకప్‌లలో హర్భజన్ సింగ్, కేరళ ప్లేయర్ శ్రీశాంత్ కీలక పాత్ర పోషించారు. 

అలానే 2024, 2026 టీ20 ప్రపంచ కప్ లలో సంజు శాంసన్ (కేరళ), అర్ష్‌దీప్ సింగ్ (సర్దార్) సంప్రదాయాన్ని కొనసాగించారు. టీ20 ప్రపంచ కప్ 2026లో సంజు శాంసన్ అద్భుత ప్రదర్శనతో ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీని గెలుచుకున్నాడు. సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన సూపర్‌-8 మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై అజేయమైన 97 పరుగులు చేశాడు. అది గాలివాటం కాదు... అని నిరూపిస్తూ.. సెమీస్‌లో ఇంగ్లండ్‌పై 89, ఫైనల్లో న్యూజిలాండ్‌పై 89 పరుగులు చేసి జట్టు టైటిల్ అందుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. అలానే 2024 ప్రపంచకప్‌లో టాప్ వికెట్ టేకర్‌గా (17 వికెట్లు) నిలిచి అర్ష్‌దీప్‌ సింగ్‌.. తాజా ఎడిషన్‌లోనూ (2026) ఇంచుమించు అదే తరహా ప్రదర్శనలతో (9 వికెట్లు) షేకింగ్‌ సర్దార్‌ అనిపించుకున్నాడు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...