Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ప్రపంచ సముద్ర రక్షణ కవచంగా ఇండియా.!
posted on: Jul 29, 2026 6:13PM
ప్రస్తుత ప్రపంచ రాజకీయాల్లో ప్రస్తుతం భూ సరిహద్దుల కంటే సముద్ర మార్గాల భద్రతే కీలకమైన అంశంగా మారింది. గత కొన్నేళ్ళుగా ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన ఎర్ర సముద్రంలో హౌతీ తిరుగుబాటుదారుల దాడులు, పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో భద్రతా సమస్యలు, హిందూ మహాసముద్రంలో సముద్రపు దొంగల పునరాగమనం వంటివి ప్రపంచ సరఫరా గొలుసును తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ రక్షణ, దౌత్య వర్గాల్లో భారత్ పాత్రపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. ప్రముఖ ఇజ్రాయెలీ పత్రిక ది జెరూసలేం పోస్ట్ ప్రచురించిన కథనం ప్రకారం, పశ్చిమ దేశాలు, ఇజ్రాయెల్ ఇప్పుడు ఇండియాను కేవలం ఒక పెద్ద మార్కెట్గా కాకుండా, ప్రపంచ భద్రత, సముద్ర వ్యాపార రక్షణకు అనివార్యమైన రక్షణ కవచంగా చూస్తున్నాయి.
చారిత్రక పరిణామం
కేవలం రక్షణ స్థాయి నుండి నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్ వరకూ ఇండియాకు సముద్ర ప్రయాణాలు, వాణిజ్యంతో శతాబ్దాల అనుబంధం ఉంది. చోళ సామ్రాజ్య కాలంలో భారత నౌకాబలం ఆగ్నేయాసియా వరకు విస్తరించిన చరిత్ర ఉంది. అయితే, స్వాతంత్ర్యం తర్వాత సంభవించిన సరిహద్దు యుద్ధాల వల్ల భారత్ సుదీర్ఘకాలం పాటు భూ సరిహద్దు రక్షణకే ప్రాధాన్యత ఇవ్వాల్సి వచ్చింది. 1991 ఆర్థిక సంస్కరణలు మరియు 2008 ముంబై సముద్ర దాడుల తర్వాత వ్యూహాత్మక ఆలోచనల్లో పెద్ద మార్పు వచ్చింది. 2008 నుండి గల్ఫ్ ఆఫ్ ఏడెన్ ప్రాంతంలో యాంటీ పైరసీ ఆపరేషన్లను నిరంతరాయంగా నిర్వహిస్తూ, భారత నౌకాదళం వేలాది వాణిజ్య నౌకలకు రక్షణ కల్పించింది. దీంతో ఒకప్పుడు తన సముద్ర తీరాన్ని మాత్రమే కాపాడుకునే స్థాయి నుండి, నేడు హిందూ మహాసముద్ర ప్రాంతం మొత్తానికి నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్ గా భారత్ అవతరించింది.
ప్రతి 40 రోజులకు ఒక కొత్త యుద్ధనౌక.. స్వదేశీ తయారీలో ఇండియా పురోగతి
భారత నేవీ బలోపేతం కావడం వెనుక అధునాతన మౌలిక సదుపాయాలు, వేగవంతమైన స్వదేశీ నిర్మాణ వ్యూహం ఉన్నాయి. భారత నౌకాదళ అధిపతి అడ్మిరల్ దినేష్ కె. త్రిపాఠి వెల్లడించిన వివరాల మేరకు.. సగటున ప్రతి 40 రోజులకు ఒక కొత్త స్వదేశీ యుద్ధనౌక లేదా జలాంతర్గామి రక్షణ దళంలో చేరుతోంది. ప్రస్తుతం నౌకాదళంలో 145కి పైగా నౌకలు సేవలందిస్తుండగా, మరో 52 నౌకలు మన దేశీయ షిప్యార్డులలోనే నిర్మాణంలో ఉన్నాయి. నౌకాదళ ఉన్నతాధికారుల అంచనా ప్రకారం, 2030 నాటికి 155కి పైగా స్వదేశీ యుద్ధనౌకలను, 2035 నాటికి ఏకంగా 200 నౌకల భారీ నౌకాదళాన్ని సిద్ధం చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు అమలువుతున్నాయి.
గతంలో ఎర్ర సముద్రంలో సంక్షోభం తలెత్తినప్పుడు భారత్ 30కి పైగా యుద్ధనౌకలను రంగంలోకి దించి, అంతర్జాతీయ వాణిజ్య నౌకలకు రక్షణగా నిలవడం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. అంతర్జాతీయ చట్టాలు, సముద్ర జలసంధుల రక్షణ, సముద్ర భద్రత , వాణిజ్య స్వేచ్ఛకు ఐక్యరాజ్యసమితి సముద్ర చట్ట ఒప్పందం కీలక పునాది. ప్రపంచ చమురు రవాణాలో 20 శాతం జరిగే హార్ముజ్ జలసంధి, అలాగే బాబ్ ఎల్-మాండెబ్, మలక్కా జలసంధులు సజావుగా సాగడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అత్యవసరం. ఈ కీలక మార్గాలు మూతపడితే ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థ స్తంభిస్తుంది. భారత్ అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉంటూనే.. ఈ నౌకాయాన మార్గాలను సురక్షితంగా ఉంచేందుకు తన సైనిక, దౌత్య సామర్థ్యాలను ఉపయోగిస్తోంది. అండమాన్ నికోబార్ దీవులలో వ్యూహాత్మక మౌలిక సదుపాయాలను పెంచుకోవడం ద్వారా మలక్కా జలసంధిపై నిరంతర పర్యవేక్షణ పెంచడం భారత్ చేపట్టిన కీలక చర్యలలో ఒకటి.
ఇండియా, ఇజ్రాయెల్, పశ్చిమ దేశాల రక్షణ భాగస్వామ్యం
ప్రస్తుత ప్రపంచ రాజకీయాల్లో పశ్చిమ దేశాలకు భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా మారింది. ఇజ్రాయెల్తో భారత్ సంబంధాలు కేవలం ఆయుధ కొనుగోలు స్థాయిని దాటి, సంయుక్త పరిశోధనలు, ఉత్పత్తి దశకు చేరుకున్నాయి. ఇజ్రాయెల్కు చెందిన ప్రముఖ రక్షణ సంస్థ రాఫెల్, తన ప్రసిద్ధ ఐరన్ డోమ్ ఇంటర్సెప్టర్ పరిజ్ఞానానికి సంబంధించిన తయారీని భారత్లోనే చేపడుతుండటం వ్యూహాత్మక మార్పునకు అద్దం పడుతోంది. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాల కింద జరుగుతున్న ఈ పరిణామాలు రక్షణ రంగంలో దేశీయ సామర్థ్యాన్ని భారీగా పెంచుతున్నాయి.
ఆర్థిక రక్షణ, ఐఎమ్ఈసీ ప్రాజెక్ట్ ప్రాముఖ్యత
ఇండియా ప్రపంచంలో మూడవ అతిపెద్ద చమురు వినియోగదారుగా, ప్రధాన ఇంధన శుద్ధి కేంద్రంగా ఉంది. భారత్, గల్ఫ్ దేశాల మధ్య వాణిజ్యం వందల బిలియన్ డాలర్లకు చేరుకోవడంతో.. సముద్ర మార్గాల భద్రత భారత ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైంది. ఈ నేపథ్యంలో ప్రతిపాదిత ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరప్ ఎకనామిక్ కారిడార్ (ఐఎమ్ఈసీ) ద్వారా హార్ముజ్ జలసంధిపై ఆధారపడటాన్ని తగ్గించి, ఆసియా, గల్ఫ్, యూరప్లను సురక్షితమైన సముద్ర, రైలు మార్గాల ద్వారా అనుసంధానించేందుకు అడుగులు పడుతున్నాయి.
గ్లోబల్ ఆర్డర్లో రూపుదిద్దుకుంటున్న కొత్త ఇండియా
ఒకప్పుడు కేవలం భూ సరిహద్దు భద్రతకే పరిమితమైన ఇండియా.. నేడు గ్లోబల్ మారిటైమ్ సెక్యూరిటీలో కీలక పాత్ర పోషిస్తోంది. పశ్చిమ దేశాలు, ఇజ్రాయెల్ ఇండియాతో కలసి పనిచేయడానికి ఆసక్తి చూపడం వెనుక భారత్ క్రమశిక్షణ, సముద్ర నౌకాదళ వేగం, రక్షణ విధానాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాబోయే దశాబ్దాల్లో అంతర్జాతీయ సముద్ర వాణిజ్యాన్ని సురక్షితంగా నడిపించడంలో, నిబంధనలతో కూడిన ప్రపంచ వ్యవస్థను కాపాడటంలో భారత్ పాత్ర కీలకం కానుంది.
భవిష్యత్ పరిణామాలు, అంతర్జాతీయ దృష్టి
ముందుముందు హిందూ మహాసముద్ర ప్రాంతంలో సంభవించే భౌగోళిక రాజకీయ మార్పులు భారత నౌకాదళ విస్తరణపై ఆధారపడి ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నౌకాదళాన్ని ఆధునీకరించడం, మిత్రదేశాలతో సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించడం ద్వారా సముద్ర భద్రతలో భారత్ సాధిస్తున్న పురోగతి ప్రపంచ రక్షణ సమీకరణాలను పునర్నిర్వచిస్తోంది. ప్రపంచ వాణిజ్యానికి భారత్ కేవలం లబ్ధిదారుగా మాత్రమే కాకుండా, సంరక్షకుడిగా నిలుస్తోంది.
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.
Indian Navy, India-Israel relations, maritime security, Indian Navy, strategic security





