ఎంపీ సీట్ల పెంపు.. మ‌రో ద‌క్షిణాది పోరాటానికి నాంది?

posted on: Apr 14, 2026 10:11AM

ఎంపీ సీట్ల పెంపు విష‌యంలో రేవంత్ రెడ్డి  వాద‌నేంటి?  జీడీపీని బ‌ట్టి మెరిట్ రాష్ట్రాల‌కు సీట్లు ఉండాల‌న‌డంలో అర్ధ‌మేంటి?  టోట‌ల్ గా ఆయ‌న ఎలాంటి రీజ‌న్లు చూపుతున్నారు?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో చాలా గట్టి వాదన వినిపిస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాలకు లబ్ధి చేకూరి, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగేలా ఈ ప్రక్రియ ఉండకూడదనేది ఆయన గట్టిగా చెబుతున్నారు.

జనాభా నియంత్రణ  శిక్షా? బహుమతా? అని నిల‌దీస్తున్నారు సీఎం రేవంత్. కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్లను పెంచాలని చూస్తోంది. ఆనాడు కేంద్రం పిలుపునిచ్చిందని దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక  కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేశాయి. ఫలితంగా ఇక్కడ జనాభా పెరగలేదు. స‌రిగ్గా అదే స‌మ‌యంలో ఉత్తరాది రాష్ట్రాలు జనాభాను నియంత్రించలేకపోయాయి.

ఇప్పుడు జనాభా పెరిగిన ఉత్తరాది రాష్ట్రాల‌కు ఎక్కువ ఎంపీ సీట్లు ఇచ్చి, జనాభాను అదుపు చేసిన ద‌క్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గించడం అంటే.. బాధ్యతగా ఉన్నందుకు మమ్మల్ని శిక్షించడమే అని వాదిస్తున్నారాయ‌న‌.

ఇక‌ జీడీపీ, మెరిట్ ప్రాతిపదికన సీట్ల విష‌యానికి వ‌స్తే.. కేవలం జనాభాను మాత్రమే ప్రామాణికంగా తీసుకోకూడదని, మెరిట్ అంటే ప్రతిభ చూపే రాష్ట్రాలు, దేశ ఆర్థిక వ్యవస్థకు ఇస్తున్న తోడ్పాటును కూడా పరిగణనలోకి తీసుకోవాలని  ప్రతిపాదిస్తున్నారు రేవంత్ రెడ్డి.

దేశానికి వచ్చే మొత్తం పన్ను ఆదాయంలో సింహభాగం దక్షిణాది రాష్ట్రాల నుంచే వస్తోంది.  మ‌రీ ముఖ్యంగా తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాల కంట్రిబ్యూష‌న్ ఎక్కువ‌గా ఉంది.

ఈ విష‌యంలో రేవంత్ వాదన ఎలా ఉందంటే..  ఆర్థికంగా దేశాన్ని ముందుకు నడిపిస్తున్న రాష్ట్రాలకు రాజకీయంగా తక్కువ ఎంపీ సీట్లు ఉంటే, ఆ రాష్ట్రాలు భవిష్యత్తులో నష్టపోతాయి. అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు మెరిట్ సీట్లు అదనంగా కేటాయించాలని కోరుతున్నారు రేవంత్. అంటే,  మనుషుల సంఖ్యకే కాకుండా, ఆ రాష్ట్రం దేశానికి చేస్తున్న మేలుకు కూడా సీట్లు ఇవ్వాలనేది ఆయన ఉద్దేశ్యం.

ఉత్తరాది రాష్ట్రాలకు 400 పైగా సీట్లు వచ్చి, దక్షిణాదికి కేవలం 100-150 లోపు సీట్లు పరిమితమైతే, దేశ ప్రధానిని లేదా చట్టాలను నిర్ణయించే అధికారం కేవలం ఉత్తరాదికే ఉంటుంది. ఇది దక్షిణాది ఉనికిని దెబ్బతీస్తుంది.

ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలు కేంద్రానికి రూ.1 రూపాయి పన్ను కడితే, తిరిగి వచ్చేది 40 పైసలే అని ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీట్లు కూడా తగ్గితే నిధుల కేటాయింపులో మరింత వివక్ష ఎదురవుతుందని ఆందోళన చెందుతున్నారు.

రాజ్యాంగ సవరణ అవసరం అనీ అంటున్నారు తెలంగాణ‌ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి. 1971 జనాభా ప్రాతిపదికనే కాకుండా, రాష్ట్రాల అభివృద్ధి సూచికలను కూడా పరిగణనలోకి తీసుకునేలా నిబంధనలు మార్చాలని ఆయన కోరుతున్నారు.

బాధ్యతగా ఉండి జనాభాను తగ్గించినందుకు మా గొంతు నొక్కకండి అని రేవంత్ రెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఎంపీ సీట్ల పెంపు అనేది ఒక రాజకీయ క్రీడలా కాకుండా, అన్ని రాష్ట్రాల హక్కులను కాపాడేలా ఉండాలఅంటున్నారాయన. దీనిపై ఆయన ఇతర దక్షిణాది ముఖ్యమంత్రులతో కలిసి ఒక ఉమ్మడి పోరాటానికి కూడా సిద్ధమవుతున్నారు.

ఇప్ప‌టికే ద‌క్షిణాది రాష్ట్రాలు.. అత్య‌ధిక ఆదాయాన్ని దేశానికి అందిస్తున్నా.. వీరి  నుంచి ఆదాయం ఏమో అర‌వై శాతం పొంది.. హ‌క్కులేమో.. న‌ల‌భై శాతానికి కుదించ‌డం వ‌ల్లే ఈ స‌మ‌స్య కాబ‌ట్టి.. ఇది పార్టీల‌కు అతీత‌మైన పోరాటం. ఈ పోరాటంలో.. ప్ర‌తి ఒక్క ద‌క్షిణాది  రాష్ట్రం ముందుకు రావాల‌ని కోరుతున్నారు టీసీఎం రేవంత్ రెడ్డి.

google-ad-img
    Related Sigment News
    • Loading...