దుండిగల్‌లో గంజాయి అక్రమ రవాణా.. ర్యాపిడో డ్రైవర్ అప్రమత్తతతో భగ్నం

posted on: Jun 4, 2026 11:17AM

సాధారణంగా ర్యాపిడో అంటే వేగంగా డెలివరీలు చేసే సర్వీస్... కానీ ఈసారి అదే రైడ్ ఒక పెద్ద డ్రగ్స్ రవాణా ప్రయత్నాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనలో గంజాయిని పార్సిల్ రూపంలో తరలించే ప్రయత్నాన్ని ఒక ర్యాపిడో రైడర్ అప్రమత్తతతో పోలీసులు అడ్డుకున్నారు.

గత నెల 31న మేడ్చల్ ప్రాంతం నుంచి గండిమైసమ్మకు ఒక పార్సిల్ ర్యాపిడో ద్వారా బుక్ చేయబడింది. ఈ పార్సిల్‌ను బీహార్‌కు చెందిన రూపేష్ కుమార్ బుక్ చేసినట్లు సమాచారం. ప్రారంభంలో ఇది సాధారణ డెలివరీలా కనిపించినప్పటికీ, రైడర్ ఆదర్శన్‌కు పార్సిల్ పై అనుమానం కలిగింది. పార్సిల్ బరువు, ప్యాకింగ్ తీరు..  అలాగే డెలివరీ డిటెయిల్స్ విషయంలో అసహజత కనిపించడంతో అతను జాగ్రత్తగా వ్యవహరించాడు.ఎలాంటి ఆలస్యం చేయకుండా రైడర్ ఆదర్శన్ దుండిగల్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఇది ఈ కేసులో కీలక మలుపుగా మారింది. 

పోలీసులు వెంటనే అప్రమత్తమై ఆ పార్సిల్‌ను స్వాధీనం చేసుకుని పరిశీలించారు.  అందులో గంజాయి ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో అక్రమ రవాణా ప్రయత్నం స్పష్టమైంది. పోలీసులు వెంటనే నిందితుడు రూపేష్ కుమార్‌ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఈ ఘటన వెనుక మరింత నెట్‌వర్క్ ఉందా అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది.ఈ కీలక సమయంలో అప్రమత్తత చూపిన ర్యాపిడో రైడర్ ఆదర్శన్‌ను పోలీసులు ప్రత్యేకంగా అభినందించారు. 

అతని ధైర్యం మరియు సమయస్ఫూర్తిని గుర్తిస్తూ, కోటి రెడ్డి  స్వయంగా ఆయనను సన్మానించారు.  సందేహాస్పద పరిస్థితుల్లో ప్రజల అప్రమత్తతే నేరాలను అడ్డుకుంటుంది  అని ఆయన పేర్కొన్నారు.  ఈ ఘటనతో డెలివరీ సర్వీసుల ద్వారా జరుగుతున్న అక్రమ రవాణాపై పోలీసులు మరింత కఠిన నిఘా పెట్టారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...