ఆర్మీ భూములపై అక్రమ నిర్మాణాలు.. హైడ్రాను ఆశ్రయించిన రక్షణ శాఖ..!

posted on: Jul 23, 2026 7:00PM

 

హైదరాబాదు నగర పరిసరాల్లో ఆర్మీకి చెందిన భూములపై అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ రక్షణ శాఖ అధికారులు హైడ్రా కమిషనర్‌ను ఆశ్రయించారు. ఈ మేరకు ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ జై సింగ్ గురువారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలంలోని జీఎల్ఆర్ సర్వే నంబర్ 507లో ఉన్న ఆర్మీకి చెందిన ఏ-1 భూమిలో కొందరు వ్యక్తులు అక్రమంగా ప్రవేశించి నిర్మాణ కార్యకలాపాలు చేపడుతున్నట్లు ఫిర్యాదు చేశారు. 

ముఖ్యంగా ప్లాట్ నంబర్లు 27, 28 పరిధిలో సుమారు 450 గజాల భూమిని ఆక్రమించి, ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండానే జి+2 భవన నిర్మాణం కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. ఆర్మీ భూములపై జరుగుతున్న ఈ అక్రమ నిర్మాణాలను వెంటనే నిలిపివేసి, ఆక్రమణలను తొలగించి ప్రభుత్వ ఆస్తిని పరిరక్షించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని రక్షణ శాఖ అధికారులు హైడ్రా కమిషనర్‌ను కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఆక్రమణలు పునరావృతం కాకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలని కూడా విజ్ఞప్తి చేశారు.

వినతిపత్రాన్ని స్వీకరించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందిస్తూ, సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ నిర్వహించాలని ఆదేశించారు. స్థలాన్ని పరిశీలించి ఆక్రమణలు జరిగినట్లు నిర్ధారణ అయితే చట్టప్రకారం తక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో హైడ్రా ఏసీపీ ఉమామహేశ్వర రావు కూడా పాల్గొన్నారు. రక్షణ శాఖకు చెందిన భూముల పరిరక్షణ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా చట్టబద్ధ మైన చర్యలు తీసుకుంటామని హైడ్రా అధికారులు స్పష్టం వ్యక్తం చేశారు..

google-ad-img
    Related Sigment News
    • Loading...