హైదరాబాద్ మెట్రో రైలుకు తప్పిన ఘోర ప్రమాదం !
posted on: Jul 27, 2019 4:15PM

హైదరాబాద్ మెట్రో రైలుకు ఘోర ప్రమాదం తప్పింది. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వెళ్లే మెట్రో అది వెళ్లాల్సిన ట్రాక్ పై కాకుండా వేరే ట్రాక్ లో పయనించింది. అయితే పొరపాటును గుర్తించిన అధికారులు ఆ ట్రాక్లో ఎలాంటి రైళ్లు రాకుండా కంట్రోల్ చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్టు అయ్యింది. అయితే ఆ సమయంలో మెట్రో రైలులో 400 మంది ప్యాసింజర్లు ఉన్నారు. ప్రమాదంను గుర్తించిన అధికారులు మెట్రో రైలును లక్డీకపూల్కు రప్పించారు.
అక్కడ ప్రయాణికులందరిని దించివేశారు. అనంతరం దాన్ని తిరిగి వెనక్కు పంపించారు. ఒక్కసారిగా రైలు రాంగ్ రూట్లోకి వెళ్లడంతో అప్పటి వరకు లోపలున్న ప్రయాణికులకు ఏమి జరుగుతోందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత రైలు వెనక్కు వెళుతున్న సమయంలో ట్రైన్ లోపల గందరగోళ పరిస్థితి నెలకొంది. మెట్రో రైలు రాంగ్ రూట్ వెళ్లడంతో కాసేపు మెట్రో సేవలను నిలిపివేశారు అధికారులు.
రాంగ్ రూట్లో ట్రాక్ మారి ప్రయాణించడం హైదరాబాద్ మెట్రో చరిత్రలో మొదటి సారి అని అంటున్నారు. అసలు రైలు ట్రాక్ ఎలామారిందనే దానిపై అధికారులు విచారణ చేపట్టారు. పూర్తిస్థాయిలో విచారణ చేసి నివేదిక సమర్పించాలని అధికారులకు ఉన్నతాధికారులు ఆదేశించారు. విషయం తెలుసుకున్న ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ పొరపాటును అధికారులు వెంటనే గుర్తించారని, ఎదురుగా మరో రైలు వచ్చి ఉంటే ఘోర ప్రమాదం జరిగి ఉండేదని అన్నారు.






