హైదరాబాద్ యూనివర్శిటీలో కరోనా పంజా.. థర్డ్ వేవ్ వచ్చినట్టేనా?
posted on Nov 27, 2021 9:22AM
కర్ణాటకలోని ఓ మెడికల్ కాలేజ్లో 182 మంది విద్యార్థులు కరోనా వైరస్ బారినపడటం కలకలం రేపుతుండగానే హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో విద్యార్థులు మహమ్మారి బారినపడ్డారు. బహదూర్పల్లిలోని టెక్ మహీంద్ర యూనివర్సిటీలో కరోనా కలకలం రేగింది. ఇక్కడ 25 మంది విద్యార్థులకు, ఐదుగురు అధ్యాపకులకు కొవిడ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ విద్యా సంస్థకు రెండు రోజుల పాటు సెలవు ప్రకటించారు. బాధితులను హోమ్ క్వారైంటన్లో ఉండాలని వైద్యులు సూచించారు.
యూనివర్శిటీలో వెయ్యి మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. ఇప్పటివరకు దాదాపు 3 వందల మందికి పరీక్షలు చేయగా 25 మందికి వైరస్ పాజిటివ్ గా వచ్చింది. క్యాంపస్ లోని మిగితా విద్యార్థులు, సిబ్బంది టెస్టులు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కొవిడ్ నిర్దారణ అయిన 25 మంది కూడా సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ పూర్తయినవారే. దీంతో వ్యాక్సినేషన్ పూర్తయినా కొవిడ్ సోకుతుండటం ఆందోళన కల్గిస్తోంది.
కోవిడ్ భయంతో వర్సిటీలోని హాస్టల్స్ను విద్యార్థులు ఖాళీ చేశారు. వీరంతా యూనివర్సిటీ బయట పెద్ద సంఖ్యలో గూమిగూడటంతో ఈ విషయం బయటకు పొక్కింది. ఈ మేరకు మేడ్చల్ జిల్లా డిప్యూటీ డీఎంహెచ్వో, దుండిగల్ పీహెచ్సీ వైద్యాధికారి నిర్మల నిర్ధారించారు. ఎంతమంది విద్యార్థులకు కరోనా సోకిందనేది స్పష్టత లేదు. అయితే క్యాంపస్ మొత్తం శానిటైజేషన్ చేసిన తర్వాతే మళ్లీ క్లాసులు మొదలవుతాయని యాజమాన్యం పేర్కొంది.కాలేజీలో జరిగిన ఓ ఈవెంట్లో ఈ విద్యార్థులంతా పాల్గొన్నట్టు తెలుస్తోంది. కొద్ది రోజుల కిందట క్యాంపస్లో ఫ్రెషర్స్ డే నిర్వహించారని, ఆ సమయంలో వీరికి వైరస్ సోకి ఉంటుందని అనుమానిస్తున్నాయి. దీనిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
కర్ణాటక యూనివర్సిటీలోనూ ఫ్రెషర్స్ పార్టీ కరోనాకు సూపర్స్ప్రెడర్గా మారింది. ధార్వాడ్ మెడికల్ కాలేజీలో 1,000 మందికి పరీక్షలు నిర్వహించగా.. 182 మందికి పాజిటివ్గా తేలింది. మరికొందరి నివేదికలు రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. మూడో దశ ముప్పు హెచ్చరికల నేపథ్యంలో విద్యా సంస్థల్లో భారీగా కోవిడ్ కేసులు నమోదుకావడం కలవరానికి గురిచేస్తోంది.