మెట్రో లేఖ కలకలం... అంతా ఎల్ అండ్ టి పథకమా?

posted on: Sep 18, 2014 2:58PM

 

తెలంగాణ ప్రభుత్వం నిర్మాణ బాధ్యతలు తీసుకుంటే హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టు నుంచి తాము తప్పుకుంటామని మెట్రో రైలు పనులు నిర్వహిస్తున్న ఎల్ అండ్ టి సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సంచలనం సృష్టించింది. ఎల్ అండ్ టి రాసిన లేఖ గురించి పత్రికలలో కథనాలు రావడంతో రాష్ట్ర రాజకీయాలలో కుదుపు సంభవించింది. కేసీఆర్ ప్రభుత్వంతోపాటు ఎల్ అండ్ టి సంస్థ కూడా ఉలిక్కిపడినట్టు కనిపించింది. గంటల వ్యవధిలోనే రకరకాల మీటింగ్స్ జరిగాయి. ఎల్ అండ్ టి సంస్థ ఛైర్మన్ గాడ్గిల్‌తో సీఎం కేసీఆర్ కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశాలన్నీ జరిగిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం పత్రికల్లో వెలువడిన కథనాలను ఖండిస్తూ, ఆ కథనాలు తెలంగాణకు నష్టం కలిగించేలా వున్నాయని ప్రకటించింది. మెట్రో రైలు సంస్థ కూడా మెట్రో పనులన్నీ సూపర్‌గా జరుగుతున్నాయని, పనులు ఎక్కడా ఆగలేదని వివరణ ఇచ్చింది. ఎల్ అండ్ టి ఛైర్మన్ గాడ్గిల్ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇలాంటి లేఖలు మామూలేనని, తాము రాసిన లేఖ ఎలా బయటపడిందో అర్థం కావడం లేదని అమాయకత్వాన్ని ప్రదర్శించారు. మొత్తమ్మీద ఎల్ అండ్ టి సంస్థ తెలంగాణ ప్రభుత్వానికి రాసిన లేఖ ప్రభుత్వంలో కదలిక తెచ్చింది. సాధ్యమైనంత త్వరగా మెట్రో రైలును పూర్తి చేయాలన్న నిర్ణయానికి తెలంగాణ ప్రభుత్వం వచ్చేలా చేసింది. మొత్తం మీద ఎల్ అండ్ టి లేఖ లీకేజ్ వ్యవహారం మెట్రో రైలును ఒక గాడిన పడేసిందని చెప్పవచ్చు.

 

అంతా బాగానే వుంది.. మరి ఇంతకీ ఎల్ అండ్ టి లేఖను బయటకి లీక్ చేసిందెవరు? దీనికి రాజకీయ పరిశీలకులు ఈ ఇష్యూ అంతా ఎల్ అండ్ టి పథకంలో భాగమేనని విశ్లేషిస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి మెట్రో రైలుకు అనేక రకాల ఆటంకాలు కలిగిస్తూ వున్నారు. మెట్రో రైలు అలైన్‌మెంట్ విషయంలోగానీ, మెట్రో రైలుకు కేటాయించిన స్థలాల విషయంలో కానీ రకరకాలుగా మాట్లాడుతున్నారు. సీఎం కేసీఆర్ అయితే మేం చెప్పినట్టే ఎల్ అండ్ టీ సంస్థ వినాలి. మేం చెప్పినట్టే ప్రతిపనీ చేయాలని అన్నట్టుగా ధీమాతో మాట్లాడుతూ వచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా కాంట్రాక్టులు చేస్తూ వ్యాపారంలో బాగా ముదిరిపోయి వున్న ఎల్ అండ్ టి సంస్థ సంస్థ కొంతకాలం తెలంగాణ ప్రభుత్వ వ్యవహార శైలిని గమనించి, తనదైన శైలిలో పావులు కదిపి తాను తెలంగాణ ప్రభుత్వానికి రాసిన లేఖలను తానే బయటపెట్టి వుండొచ్చన్న అభిప్రాయాలను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి తాను ఘాటుగా రాసిన లేఖను తానే లీక్ చేసి తద్వారా తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టి, మెట్రో పనుల విషయంలో తనకు ఏర్పడిన ఆటంకాలను తొలగించే పథక రచన చేసి వుండొచ్చని అంటున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...