హెచ్సీయూలో చోరీలకు పాల్పడ్డ నిందితులు అరెస్ట్
posted on: Feb 16, 2026 5:13PM

హైదరాబాద్ నగరంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన భారీ ల్యాప్టాప్ల చోరీ కేసును గచ్చిబౌలి పోలీసులు విజయవంతంగా ఛేదించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగించి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కూకట్పల్లికి చెందిన రేగుల చంద్రశేఖర్ ఈ చోరీలకు ప్రధాన సూత్రధారిగా పోలీసులు గుర్తించారు.. ఇతను సాయిచరణ్ (19), అశ్విన్ రావు (19) అనే ఇద్దరు విద్యార్థుల సాయం తీసుకుని ఈ చోరీలకు పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు.
ఈ కేసులో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. వారంలో క్రితం యూనివర్సిటీ పరిధిలోని సి.వి.రావు ఇన్స్టిట్యూట్లో చోటుచేసుకున్న ఈ చోరీ విద్యా వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. దర్యాప్తు చేపట్టిన గచ్చిబౌలి పోలీసులు సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీలను విశ్లేషిస్తూ నిందితులను గుర్తించారు.
ఈ చోరీకి పాల్పడిన వారిలో యూనివర్సిటీలోనే చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ఉండటం సంచలనంగా మారింది. విద్యను అభ్యసించాల్సిన విద్యార్థులే దొంగతనానికి పాల్పడటం కలకలం రేపుతోంది. వీరికి సహకరించిన మరో ఇద్దరు నిందితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చోరీ అనంతరం దొంగిలించిన ల్యాప్టాప్లను నగరంలో కాకుండా బెంగళూరుకు తరలించడం ద్వారా పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినట్లు విచారణలో తేలింది. ముందస్తుగా పథకం రచించి యూనివర్సిటీ సీసీటీవీ ఐపీ అడ్రస్లను హ్యాక్ చేసి, పోలీసుల కదలికలను తమ మొబైల్ ఫోన్ల ద్వారా గమనిస్తూ దొంగతనాన్ని అమలు చేసినట్లు అధికారులు గుర్తించారు.
అంతేకాకుండా, నేరం చేసినప్పుడు ఉపయోగించిన కారును గుర్తించకుండా ఉండేందుకు నెంబర్ ప్లేట్ను మార్చి వినియోగించినట్లు బయటపడింది. నిందితుల వద్ద నుంచి మొత్తం 55 ల్యాప్టాప్లు, ఒక కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ల్యాప్టాప్ల విలువ లక్షల్లో ఉంటుందని సమాచారం. ఈ ఘటన యూనివర్సిటీ భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
అంతర్గతంగా చదువుతున్న విద్యార్థులే సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేసి చోరీకి పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది. విద్యాసంస్థల్లో సైబర్ భద్రత, సీసీటీవీ నెట్వర్క్ల రక్షణపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు, నిందితుల నేపథ్యం, ల్యాప్టాప్లను విక్రయించే ప్రయత్నాలు జరిగాయా అనే అంశాలపై పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.






