విమానాశ్రయం పేరు మార్పుపై పంతాలేలా?

posted on: Jun 26, 2014 9:18PM

 

హైదరాబాద్ విమానాశ్రయం పేరును మళ్ళీ యన్టీఆర్ అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చాలని మహానాడు సమావేశాలలో చంద్రబాబు నాయుడు కోరారు. తెదేపాకే చెందిన కేంద్ర విమానయాన శాఖా మంత్రి అశోక్ గజపతి రాజు అందుకు సంసిద్దత వ్యక్తం చేసారు కూడా. చంద్రబాబు ఈరోజు డిల్లీలో హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసినపుడు మళ్ళీ ఈ విషయాని ఆయనకీ మరోమారు గుర్తు చేసారు. విమానాశ్రయం బేగంపేటలో ఉన్నపుడు దానికి యన్టీఆర్ పేరుందని కాని ఆ తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 2008లో శంషాబాద్ విమానాశ్రయానికి రాజీవ్ గాంధీ పేరు పెట్టిందని, అందువల్ల మళ్ళీ దానిని మార్చి యన్టీఆర్ పేరు పెట్టాలని ఆయన డిమాండ్ చేసారు. దానికి కేంద్రప్రభుత్వం ఏవిధంగా స్పందించిందో తెలియదు కానీ, రాష్ట్ర విభజన కారణంగా ఇప్పటికే అనేక సమస్యలతో పట్లు పడుతున్న రెండు రాష్ట్రాలు, ఇప్పుడు మరో సరికొత్త సమస్యతో యుద్ధం మొదలుపెట్టక తప్పదు. విమానాశ్రయానికి యన్టీఆర్ పెట్టాలని ఆయనను అభిమానించే వారు కోరుకోవడంలో అసహజమేమీ లేదు. కానీ మళ్ళీ కొన్నేళ్ళ తరువాత ఈ విమానాశ్రయం తెలంగాణా ప్రభుత్వం అధీనంలోకి వెళ్ళినప్పుడు, మళ్ళీ యన్టీఆర్ పేరును తొలగించి వేరేవారి పేరు పెడితే అది ఆ మహనీయుడికి అవమానించినట్లే అవుతుంది. అంతేకాక ఈరోజు ఆయన పేరు పెట్టినప్పుడు సంతోషిస్తున్నవారు రేపు పేరు మార్చుతున్నపుడు బాధపడక తప్పదు. అందువల్ల ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిలో నిర్మించబోయే కొత్త అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆయన పేరు పెడితే ఆంద్ర ప్రజలందరూ సంతోషిస్తారు కదా! ఇంతకంటే ఆయనకు భారతరత్న అవార్డు కోసం కృషిచేస్తే అందరూ హర్షిస్తారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...