Latest News
దుబాయ్లో భారత వ్యాపారుల మానవత్వం
posted on: Mar 10, 2026 3:40PM

ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య ఘర్షణలతో పలువురు భారతీయులు పశ్చిమాసియా దేశాల్లో చిక్కుకుపోయి అల్లాడుతున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో దుబాయ్లో చిక్కుకొన్న వారికి సహాయం చేసేందుకు భారత సంతతి వ్యాపారవేత్త యోగేశ్ దోషి ముందుకువచ్చారు. 64 నివాసాలు ఉన్న తన అపార్ట్మెంట్లో వసతి కల్పిస్తున్నారు. ఈ మేరకు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఘర్షణల కారణంగా విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. దాంతో యూఏఈ నుంచి స్వదేశానికి రావాల్సిన పలువురు భారతీయులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో తనవంతు సహాయం చేయాలని అల్ మిజన్ గ్రూప్ ఛైర్మన్ యోగేశ్ దోషి భావించారు. ఇండియన్ పీపుల్స్ ఫోరమ్ యూఏఈ, దుబాయ్లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా సమన్వయంతో తన అపార్ట్మెంట్లో తాత్కాలిక షెల్టర్ను ఏర్పాటుచేశారు. ఇప్పటివరకు 125 మందికి ఉచితంగా వసతి కల్పించారు. వారికి ఆహారం వంటి కనీస సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూసుకుంటున్నారు. తాము ఇప్పటికే బుక్ చేసుకున్న హోటళ్లలో ఉండేందుకు గడువు ముగిసిందని, పొడిగింపు వీలు కాని క్లిష్ట సమయంలో తమకు ఈ సహాయం అందిందని పలువురు మీడియాతో మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశారు.
యోగేశ్తో పాటు ఆ దేశంలో స్థిరపడిన పలువురు భారత సంతతి వ్యక్తులు ఈ ఉద్రిక్త సమయంలో తమ స్నేహహస్తం అందిస్తున్నారు. దుబాయ్ కు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న అజ్మన్లో వ్యాపారవేత్త ధీరజ్జైన్ ఇలాంటి వసతులే ఏర్పాటుచేశారు. వెంటనే స్వదేశానికి వెళ్లలేనివారి కోసం తన ఫామ్హౌస్లో తాత్కాలిక వసతి కల్పించారు. ఆర్థికంగా ఇబ్బందిపడుతున్న వారికి ఉచితంగా ఈ సౌకర్యం అందిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని ఈ షెల్టర్ వద్దకు తీసుకురావడానికి రోల్స్ రాయిస్ సహా 11 కార్లను నడుపుతుండటం విశేషం.



.webp)


