అంతర్జాతీయ విమానాశ్రయాల్లో 62 కోట్ల గంజాయి పట్టివేత

posted on: Mar 4, 2026 5:05PM

 

దేశంలోని రెండు ప్రధాన అంతర్జాతీయ విమానా శ్రయాల్లో భారీగా విదేశీ గంజాయి పట్టుబడడం కలకలం రేపింది. ముంబై మరియు బెంగళూరు నగరాల్లో కస్టమ్స్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో కోట్ల రూపాయల విలువైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో 45 కోట్లు

 ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్ర యంలో కస్టమ్స్అధికారులు నిర్వహించిన తనిఖీల్లో సుమారు రూ.45 కోట్ల విలువైన 45 కిలోల విదేశీ గంజాయి పట్టుబడింది. బ్యాంకాక్ నుంచి ముంబైకి చేరుకున్న తొమ్మిది మంది ప్రయాణికుల వద్ద ఈ గంజాయిని గుర్తించారు. కస్టమ్స్ అధికారులకు అనుమానం రాకుండా ఉండేందుకు గంజాయిని సిగరెట్ డబ్బాలలో కలిపి తరలించే ప్రయత్నం చేసినట్లు అధికా రులు వెల్లడించారు. అయితే స్కానింగ్ సమయంలో లగేజ్‌లో అనుమానాస్పద పదార్థాలు గుర్తించడంతో లోతుగా తనిఖీ చేయగా గంజాయి గుట్టు రట్టైంది. ఈ ఘటనపై తొమ్మిది మంది సభ్యులతో కూడిన గ్యాంగ్‌పై  NDPS చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

బెంగుళూరులో 17కోట్లు

అదేవిధంగా బెంగళూరు లోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీగా విదేశీ గంజాయి పట్టుబడింది. సుమారు రూ.17 కోట్ల విలువైన 17 కిలోల గంజాయిని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. స్కానింగ్‌కు చిక్కకుండా ఉండేందుకు గంజాయిని ప్లాస్టిక్ కవర్లలో చుట్టి, పైగా కార్బన్ పేపర్‌తో ప్యాకింగ్ చేసి లగేజ్ బ్యాగుల్లో దాచినట్లు అధికారులు తెలిపారు. 

ప్రయాణికుల ప్రవర్తనలో అనుమానం రావడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా మత్తు పదార్థాల స్మగ్లింగ్ వ్యవహారం కాస్త బయటపడింది. ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేసి, NDPS చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దేశంలోని ప్రధాన విమానాశ్రయాల ద్వారా మత్తు పదార్థాల స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న గ్యాంగ్‌లపై కస్టమ్స్ అధికారులు కఠినంగా నిఘా పెట్టినట్లు వెల్లడించారు. అంతర్జాతీయ రూట్లపై ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు మరింత కట్టుదిట్టం చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...