ఇరాన్ వార్ లో అమెరికా న‌ష్టం ఎంతంటే?

posted on: May 25, 2026 12:56PM

ప్రపంచవ్యాప్తంగా అజేయమైన శక్తిగా గుర్తింపు పొందిన అమెరికా వైమానిక దళానికి, ఇరాన్‌తో జరుగుతున్న ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ- ఒక కఠినమైన యుద్ధ‌ పాఠాన్ని నేర్పింద‌నే  చెప్పాలి. కాంగ్రెస్ రీసెర్చ్ సర్వీస్- సీఆర్ఎస్ తాజా నివేదిక ప్రకారం, 2026- ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ ఘర్షణల్లో అమెరికా సుమారు 29 బిలియన్ డాలర్ల విలువైన 42 యుద్ధ విమానాలను, డ్రోన్లను కోల్పోయింది. ఈ మొత్తం భార‌త క‌రెన్సీలో చెబితే..  2.775 లక్షల కోట్ల రూపాయలు. ఇది యుద్ధ రంగంలో అత్యాధునిక సాంకేతికతకు కూడా ఎదురవుతున్న క్షిపణి సవాళ్లను ప్రపంచం ముందుంచింది.

ఆ నష్టాల చిట్టా ఎలాంటిదంటే- అమెరికా కోల్పోయిన వైమానిక ఆస్తులు ముఖ్య‌మైన‌వి. ఈ యుద్ధంలో అమెరికా తన అమ్ములపొదిలోని అత్యంత విలువైన ఆయుధాలను కోల్పోయింది. సీఆర్ఎస్ నివేదిక ప్రకారం, నష్టపోయిన వాటిలో.. ఫైటర్ జెట్లు- 4, ఎప్-15ఈ స్ట్రైక్ ఈగిల్స్, ఒక ఎఫ్ 35ఏ లైట్నింగ్ II స్టెల్త్ ఫైటర్.
డ్రోన్లు- 24 ఎమ్ క్యూ-9 రీపర్ డ్రోన్‌లు, ఒక ఎమ్ క్యూ-4సీ ట్రైటాన్. ఇక 7 కేసీ-135 ట్యాంకర్లు, ఒక ఈ-3 సెంటినల్ ఏడబ్ల్యుఏసీఎస్, వీటితో పాటు.. హెచ్ హెచ్  -60డబ్ల్యు హెలికాప్టర్ వంటి కీలక రక్షణ ఆస్తులు దెబ్బతిన్నాయి.

కేవలం మూడు నెలల కాలంలో 24 ఎమ్ క్యు-9 రీపర్ డ్రోన్‌లను కోల్పోవడం, ఆధునిక డ్రోన్ యుద్ధ తంత్రంలో అమెరికా రక్షణ కవచాల బలహీనతను ఎత్తిచూపుతోంది. 

అమెరికా- ఇజ్రాయెల్ దాడుల త‌ర్వాత‌.. ఇరాన్ సైనిక శక్తి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని భావించిన వారికి, నిఘా వర్గాల తాజా అంచనాలు షాక్ ఇస్తున్నాయి. హోర్ముజ్ జలసంధి వెంబడి ఉన్న 33 క్షిపణి స్థావరాలలో.. 30కి పైగా కేంద్రాలు తిరిగి కార్యకలాపాలను ప్రారంభించాయని నివేదికలు చెబుతున్నాయి. 

ఇరాన్ తన 70శాతం క్షిపణి నిల్వలను, మొబైల్ లాంచర్లను సురక్షితంగా కాపాడుకోగలిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ నౌకాదళం, క్షిపణి వ్యవస్థలు నాశనమయ్యాయని ప్రకటిస్తున్నప్పటికీ, గ్రౌండ్ లెవ‌ల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉండటం వాషింగ్టన్ వ‌ర్గాల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.

ఈ సంఘర్షణ కేవలం రెండు దేశాల మధ్య.. యుద్ధం మాత్రమే కాదు, ఇది  క్లాసిక్ వార్‌ఫేర్,  మిస్సైల్ వార్‌ఫేర్ మధ్య జరుగుతున్న పోరాటం. అమెరికా సైనిక సంసిద్ధతపై ప్రశ్నలు లేవనెత్తిన ఈ నష్టాలు, ఆధునిక వాయు రక్షణ వ్యవస్థలను మరింత శక్తివంతం చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. ఇరాన్ తన భూగర్భ సౌకర్యాలను వాడుకుంటూ, క్షిపణి దాడుల ద్వారా అమెరికా బలగాలకు, గల్ఫ్ మౌలిక సదుపాయాలకు నిరంతర ముప్పుగా కొనసాగుతోంది. 

ఇరు దేశాల మధ్య చర్చలు ఒక ఒప్పందానికి, తిరిగి దాడులకు మధ్య డోలాయమానంలో ఉన్నాయి. అమెరికా వైపు భారీ ఆర్థిక నష్టం, ఆస్తుల విధ్వంసం, ఇరాన్ క్షిపణి సామర్థ్యం.. ఈ రెండింటి మధ్య ప్రస్తుత పరిస్థితి ప్రపంచ ఇంధన భద్రతను ప్రమాదంలో పడేస్తోంది. ఆధునిక సాంకేతికతతో కూడిన యుద్ధం, ఎంతటి శక్తివంతమైన దేశానికైనా భారీ మూల్యాన్ని వసూలు చేస్తుందని ఈ ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. శాంతియుత పరిష్కారం వైపు అడుగులు పడకపోతే, ఇంధన ధరలు, ప్రాంతీయ స్థిరత్వం మరింత సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉంది.

-సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.    

google-ad-img
    Related Sigment News
    • Loading...