Latest News
హార్మోజ్ జలసంధి....ఆ రెండు దేశాలకు నో ఎంట్రీ!
posted on: Mar 16, 2026 4:12PM

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ, ప్రపంచ దేశాలకు ఇరాన్ ఒక కీలక ప్రకటన చేసింది. వ్యూహాత్మకమైన హార్మోజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా మూసివేసిందంటూ వస్తున్న వార్తలపై ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పష్టతనిచ్చారు.
శత్రు దేశాలకు మాత్రమే ఆంక్షలు!
ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20 శాతం వాటా కలిగిన ఈ జలసంధిపై ఇరాన్ ఆంక్షలు విధించింది. అయితే, ఇది అందరికీ వర్తించదని అరాగ్చీ స్పష్టం చేశారు. తమ శత్రువులుగా భావిస్తున్న అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు చెందిన నౌకలను మాత్రమే ఈ మార్గంలో అనుమతించబోమని ఆయన తేల్చి చెప్పారు. ఇతర దేశాల నౌకలు యధావిధిగా ప్రయాణించవచ్చని, ప్రస్తుతం అనేక చమురు ట్యాంకర్లు ఈ మార్గంలో వెళ్తున్నాయని ఆయన పేర్కొన్నారు. భద్రతా కారణాలతో ఏదైనా ప్రైవేట్ కంపెనీ ప్రయాణాన్ని నిలిపివేస్తే దానికి ఇరాన్ బాధ్యత వహించదని స్పష్టం చేశారు.
సుప్రీం లీడర్ ఆరోగ్యంపై వివరణ
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ఇజ్రాయెల్ దాడుల్లో గాయపడ్డారంటూ అమెరికా మీడియాలో వస్తున్న వార్తలను అరాగ్చీ తీవ్రంగా ఖండించారు. ఆయన పూర్తిగా సురక్షితంగా ఉన్నారని, తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇరాన్ వ్యవస్థ కేవలం ఒక్క వ్యక్తిపై మాత్రమే ఆధారపడదని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేశ యంత్రాంగం ముందుకు సాగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అణు బాంబుల వార్తలపై క్లారిటీ
జెనీవా చర్చల సందర్భంగా ఇరాన్ వద్ద 11 అణుబాంబులకు సరిపడా యురేనియం ఉందని తాను అన్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని అరాగ్చీ పేర్కొన్నారు. తన వ్యాఖ్యలను మీడియా తప్పుగా వక్రీకరించిందని, ఆ చర్చలకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రపంచం ముందుకు తీసుకొస్తామని చెప్పారు.మొత్తానికి, అమెరికా ఒత్తిడికి తలొగ్గే ప్రసక్తే లేదని ఇరాన్ పరోక్షంగా హెచ్చరించింది. హార్మూజ్ జలసంధిని తమ వ్యూహాత్మక ప్రయోజనాల కోసం వాడుకుంటామని చెబుతూనే, అంతర్జాతీయ సమాజానికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేసింది.






