పరామర్శల పేరుతో బలప్రదర్శనలా?

posted on: Aug 6, 2026 6:19PM

ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది.  పరామర్శల పేరుతో వైసీపీ అధినేత  జగన్   రాజకీయం చేస్తున్నారంటూ  హోంమంత్రి వంగలపూడి అనిత విమర్శించారు. పరామర్శను  రాజకీయ బలప్రదర్శనకు వాడుకోవడం ఎంతమాత్రం తగదని మండిపడ్డారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో   , జగన్ మోహన్ రెడ్డి పర్యటనల వెనుక ఉన్న అసలు నైజాన్ని వంగలపూడి వనిత  ఎండగట్టారు. జగన్ బయటకు అడుగు పెడితే విధ్వంసాలు, అరాచకాలు చోటుచేసుకుంటున్నాయని, అసలు ఈ రకమైన పర్యటనల ద్వారా సమాజానికి ఆయన ఎలాంటి సందేశాన్ని ఇవ్వాలని అనుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

  తన విమర్శలకు బలం చేకూరుస్తూ..  జగన్ పర్యటనలలో జరిగిన పలు సంఘటనలకు సంబంధించిన వీడియో ఆధారాలను   వంగలపూడి అనిత ఈ సందర్భంగా  ప్రదర్శించారు. సాధారణంగా ఎవరైనా పరామర్శకు వెళ్తే బాధితులను ఓదార్చడం, వారికి  అండగా నిలవడం ఆనవాయితీ అనీ, కానీ జగన్ మాత్రం  నిజమైన బాధితులను వదిలేసి నిందితులను పరామర్శించడానికి వెడుతున్నారనీ మండిపడ్డారు.   క్రికెట్ లేదా ఇతర ఆన్‌లైన్ బెట్టింగ్‌లలో డబ్బులు పోగొట్టుకుని  ఆత్మహత్య చేసుకున్న ఒక వ్యక్తి విగ్రహావిష్కరణ మహోత్సవానికి జగన్ స్వయంగా హాజరవడం ఏ రకమైన సంకేతమని ఆమె ప్రశ్నించారు.  

వైసీపీ నేతలు,  కార్యకర్తలు   బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారన్న అనిత,  జగన్ పర్యటన సందర్భంగా ఒక వ్యక్తి ఆయన కారు కింద పడినా కనీసం పట్టించుకోకుండా, మానవత్వం లేకుండా కారును ఆపకుండా వెళ్లిపోవడం దారుణమన్నారు. ప్రజా రవాణాకు, అత్యవసర వైద్య సేవలకు  విఘాతం కలిగిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను ఆసుపత్రికి తరలించే అంబ్యులెన్స్‌లకు సైతం దారి ఇవ్వకుండా వైసీపీకార్యకర్తలు రహదారులపై హంగామా చేస్తూ ప్రజల ప్రాణాలతో  చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. పరామర్శల పేరుతో రోడ్లపైకి వస్తున్న సమయాల్లో అమాయక మహిళలపై దాడులు జరగడం, విధుల్లో ఉన్న పోలీస్ అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తూ బ్లాక్‌మెయిల్ చేసే ప్రయత్నాలు చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు వంగలపూడి అనిత. 

జగన్  ఈ తరహా పరామర్శల పేరిట నిర్వహిస్తున్న రాజకీయ బలప్రదర్శనల వల్ల ఇప్పటికే రాష్ట్రంలో ముగ్గురు అమాయకులు   ప్రాణాలను కోల్పోయారన్న హోంమంత్రి,   తన రాజకీయ ప్రయోజనాలు, ఉనికి కాపాడుకోవడం కోసమే ప్రజా సంక్షేమాన్ని, శాంతిభద్రతలను పక్కనబెట్టి వైకాపా నేతలు ఇలాంటి అరాచక పర్యటనలను ప్రోత్సహిస్తున్నారన్నారు. ఇప్పటికైనా జగన్ మోహన్ రెడ్డి తన తీరు  మార్చుకుని బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించాలని, ప్రజల ప్రాణాలతో ఆడుకునే రాజకీయాన్ని స్వస్తి చెప్పాలని హెచ్చరించారు.

Home Minister Anitha, YS Jagan Mohan Reddy, AP Home Minister Anitha, YSRCP Paramarsha Yatra, Anitha Slams Jagan, AP Politics News

google-ad-img
    Related Sigment News
    • Loading...