తెలుగుదేశం గూటికి పురంధేశ్వరి కుమారుడు.!

posted on: Aug 12, 2026 3:08PM

ఏపీ పాలిటిక్స్ లో  ఆసక్తికరమైన  పరిణామం చోటుచేసుకోబోతోంది. తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) మనవడు, పురందేశ్వరి కుమారుడు   దగ్గుబాటి హితేష్ చెంచురాం త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు.  నందమూరి, దగ్గుబాటి, నారా కుటుంబాల మధ్య సంబంధాలు మళ్లీ బలపడుతున్న తరుణంలో..  హితేష్ చెంచురాం టిడిపి కండువా కప్పుకోనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 

తెలుగుదేశం  ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఆ పార్టీలో అత్యంత కీలక పాత్రలను పోషిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ అల్లుడు నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అధినేతగా, ఆయన కుమారుడు, ఎన్టీఆర్ మనవడు నారా లోకేష్ పార్టీ జాతీయకార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ కుమారుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ మరో కుమారుడు దివంగత హరికృష్ణ కుమార్తె సుహాసిని పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు. ఇప్పుడు తాజాగా దగ్గుబాటి పురందేశ్వరి కుమారుడు హితేష్ తెలుగుదేశం ద్వారా ప్రత్యక్ష రాజకీయాలలోకి అడుగు పెట్టనున్నారు.   కుటుంబ బంధాలు,  రాజకీయ వేదికలు ఏకతాటిపైకి రావడం పార్టీలో నూతనోత్తేజాన్ని నింపుతుందని పరిశీలకులు అంటున్నారు.  లభిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

దగ్గుబాటి హితేష్   రాజకీయ ప్రవేశం వెనుక కుటుంబ పెద్దల సహకారం, పొత్తుల సమీకరణాలు   ఉన్నాయని అంటున్నారు. గతంలో జరిగిన కొన్ని రాజకీయ పరిణామాల కారణంగా దగ్గుబాటి కుటుంబం తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటూ వచ్చింది. అయితే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా  చంద్రబాబు నాయకత్వంలో  తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా పనిచేసేందుకు  హితేష్ ను తెలుగుదేశంలో చేర్చడం ద్వారా ఈ దూరం తగ్గుతుందని భావిస్తున్నారు. బాపట్ల జిల్లా కారంచేడు పరిధిలో ఇటీవల జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో హితేష్ క్రియాశీలకంగా పాల్గొన్నారు.  అలాగే స్థానిక ప్రజా సమస్యల పరిష్కారానికి సొంతంగా నిధులు కేటాయించడం వంటి అంశాలు ఆయన రాజకీయ ప్రవేశానికి సంకేతాలుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

2019 శాసనసభ ఎన్నికలకు ముందు దగ్గుబాటి వెంకటేశ్వరరావు,  ఆయన కుమారుడు హితేష్ చెంచురాం వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పర్చూరు నియోజకవర్గం నుంచి హితేష్ పోటీ చేయాలని భావించినప్పటికీ,  సాంకేతిక సమస్యల కారణంగా ఆయన స్థానంలో తండ్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు బరిలోకి దిగారు. ఆ ఎన్నికల అనంతరం దగ్గుబాటి తండ్రీకొడుకులు వైసీపీకి,   రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. కాగా..  దగ్గుబాటి పురందేశ్వరి బీజేపీలోనే కొనసాగుతూ ప్రస్తుతం రాజమండ్రి ఎంపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఇటీవలి కాలంలో నారా, నందమూరి, దగ్గుబాటి కుటుంబాల మధ్య సాన్నిహిత్యం  పెరిగింది. దగ్గుబాటి వెంకటేశ్వరరావు స్వయంగా చంద్రబాబు నివాసానికి వెళ్లడం, కుటుంబ వేడుకలు,  పుస్తకావిష్కరణల సందర్భంగా చంద్రబాబు, దగ్గుబాటి ఒకే వేదిక పంచుకోవడం వారి మధ్య దూరం తగ్గిపోయిందనడానికి సాక్ష్యంగా నిలిచాయి.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ఈ మూడు కుటుంబాల మధ్య  బంధం మరింత బలపడింది. ఈ సఖ్యతే హితేష్ చెంచురాం తెలుగుదేశం పార్టీలో చేరడానికి  మార్గం సుగమం చేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

Hitesh Chenchuram TDP Entry, Daggubati Hitesh Chenchuram, NTR Grandson Political Entry, TDP New Political Developments,  Daggubati Family, TeluguOne

google-ad-img
    Related Sigment News
    • Loading...