ఇక ఏపీలో హైటెక్ వ్యవసాయం!!

posted on: Jul 30, 2014 11:18AM

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయ రంగం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. తాను గతంలో పాలనలో ఉన్నప్పుడు వ్యవసాయాన్ని విస్మరించారని, కేవలం ఐటీ, పారిశ్రామిక రంగం మీద దృష్టి సారించారన్న అపవాదును మోసిన చంద్రబాబు నాయుడు ఈసారి తన మీద వున్న అపవాదును తొలగించుకునే దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది.

 

ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రంగం తరతరాలుగా వస్తున్న సంప్రదాయ పద్ధతులనే పట్టుకుని వేలాడుతోంది. దానివల్ల దిగుబడులలోగానీ, రైతు జీవితంలోగానీ మార్పు రావడం లేదు. దినదిన ప్రవర్ధమానమవ్వాల్సిన రైతు ప్రగతి తిరుగమనం బాట పట్టడానికి కారణం రైతులలో ఆధునిక వ్యవసాయ విధానం పట్ల చైతన్యం లేకపోవడమేనని చెప్పవచ్చు. ఈ లోపాన్ని గుర్తించిన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగాన్ని ఆధునిక వ్యవసాయ బాటలో నడిపించడం ద్వారా అద్భుతమైన ఫలితాలు సాధించడానికి కృషి ప్రారంభించినట్టు అర్థమవుతోంది.

 

తన తొమ్మిదేళ్ళ గత పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాంకేతికంగా అభివృద్ధి పథంలో ‘హైటెక్‌’గా నడిపించిన చంద్రబాబును ఇప్పుడు వ్యవసాయాన్ని కూడా హైటెక్ చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని రైతులందరికీ ఐప్యాడ్స్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. ఈ ఐప్యాడ్స్ ద్వారా రైతులందరికీ నేరుగా ఉపగ్రహం ద్వారా సమస్త వ్యవసాయ సమాచారం అందే అవకాశం వుంది. అలాగే వ్యవసాయం రంగంలో అంతర్జాతీయ స్థాయిలో వచ్చిన ఆధునిక పద్ధతులను కూడా ఆంధ్రప్రదేశ్‌లో అమలులోకి తేవడానికి కృషి జరుగుతోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...