అత్తాపూర్ ఆర్డీవోకు జైలు శిక్ష విధించిన హైకోర్టు

posted on: Apr 18, 2026 6:46PM

 

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్దషాపూర్‌లోని 74 ఎకరాల భూ వివాదానికి సంబంధించిన కేసులో ఉత్తర్వులు జారీ చేయడం లేదని ఆరోపిస్తూ హైదరాబాద్‌కు చెందిన యూసుఫుద్దీన్ ఖాన్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, చట్టప్రకారం ఆరు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని గత ఏడాది ఫిబ్రవరిలో ఆర్డీవో కొప్పుల వెంకట్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. అయితే, కోర్టు ఆదేశాలను ఆర్డీవో పట్టించుకోకపోవడంతో పిటిషనర్ ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. 

దీనిపై జస్టిస్ సీవీ భాస్కర్ రెడ్డి ధర్మాసనం విచారణ నిర్వహించింది. కోర్టు నిర్దేశించిన గడువులోగా ఉత్తర్వులు జారీ చేయడంలో ఆర్డీవో విఫలమయ్యారని న్యాయస్థానం అభిప్రాయపడింది. అనంతరం ఉత్తర్వులు అమలు చేసినప్పటికీ, గడువు పాటించకపోవడం ధిక్కరణ కిందకే వస్తుందని స్పష్టం చేసింది. దీంతో, ఆర్డీవో కొప్పుల వెంకట్ రెడ్డికి నెల రోజుల జైలు శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...