భూములు.. కేసీఆర్కి షాకులు..!
posted on: Jul 7, 2014 3:05PM
.jpg)
ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారాలు చేసే ముహూర్తాలు మంచివి కాకపోతే సదరు ముఖ్యమంత్రులు ఇబ్బంది పడాల్సి వస్తుందని జ్యోతిషులు చెప్పే మాట నిజమే అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ముహూర్తంలో ఏదో తేడా వున్నట్టే. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి తీసుకున్న అనేక నిర్ణయాలు బెడిసికొట్టాయి. ముఖ్యంగా భూముల విషయంలో తీసుకున్న నిర్ణయాలు రివర్స్ అవుతున్నాయి. భూమిని నమ్మున్న రైతుల రుణాలను మాఫీ చేస్తానని ఆయన ఇచ్చిన ఎన్నికల వాగ్దానం అమలులో జాప్యం చేయడం తెలంగాణ రైతాంగంలో ఆయనకి గౌరవాన్ని సన్నగిల్లేలా చేసిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అలాగే కేసీఆర్ రావడం రావడం గురుకుల్ ట్రస్ట్ భూముల మీద తన ప్రతాపం చూపించారు. నిర్మాణంలో వున్న కొన్ని భవంతులను కూలగొట్టించారు. ప్రతిపక్షంలో వుండగా గురుకుల్ ట్రస్ట్ భూములు కొనుగోలు చేసిన వారి పక్షాన నిలబడిన కేసీఆర్ అధికారంలోకి వచ్చాక తమ పార్టీ గత విధానానికి వ్యతిరేకంగా పనిచేయడం తీవ్ర విమర్శలకు కారణమైంది. అలాగే లగడపాటి రాజగోపాల్కి చెందిన ల్యాంకో హిల్స్ మీద కేసీఆర్ దృష్టి పడింది. లాంకోహిల్స్ మీద తన ప్రతాపం చూపించడానికి కేసీఆర్ సర్వ సన్నాహాలు చేసుకున్నప్పటికీ చట్టరీత్యా లాంకో హిల్స్ను తాను ఏమీ చేయలేనని అర్థం చేసుకున్న ఆయన వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. అలాగే హైదరాబాద్లోని గోకుల్ ఫ్లాట్స్ మీద కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం దాడి ప్రారంభించింది. దీని మీద కూడా విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే ఏపీ ఎన్జీవోలకు చెందిన హౌసింగ్ సొసైటీ భూములు నిరుపయోగంగా ఉన్నాయనే సాకు చూపించి ఆ భూములను తెలంగాణ ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది. ఈ స్థలానికి సంబంధించిన వివాదాలు కోర్టులో వున్న కారణంగా ఇక్కడ ఎపీ ఎన్జీవోలు ఇళ్ళు నిర్మించుకోలేదు. అంతే తప్ప హౌసింగ్ సొసైటీ భూములు నిరుపయోగంగా వుండటానికి మరే ఇతర కారణాలూ లేవు. ఆ విషయాన్ని అర్థం చేసుకోకుండా కేసీఆర్ ప్రభుత్వం ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడం వివాదంగా మారింది. కేసీఆర్ ఏపీ ఎన్జీవోల విషయంలో కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నాయన్న విమర్శలు వినిపించాయి. తాజాగా ఏపీ ఎన్జీవోలు ఈ అంశం మీద హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఈ భూముల విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలని, దీనిమీద నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కూడా ఆదేశించింది. ఈరకంగా కూడా కేసీఆర్ ప్రభుత్వం షాక్ తిన్నది. దీన్నిబట్టి మనకి అర్థం అవుతున్నదేమిటంటే, కేసీఆర్ ప్రభుత్వం భూముల గొడవల్లో తల దూర్చకపోవడం మంచిది.




.jpg)

.webp)



