Latest News
మాజీ మంత్రి కాకాణికి ఏపీ హైకోర్టు నోటీసులు
posted on: Mar 31, 2026 12:40PM

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ భూమిలో క్వార్ట్జ్ ఖనిజాన్ని అక్రమంగా తవ్వారనే ఆరోపణలతో పాటు, అడ్డుకున్న గిరిజనులను కులం పేరుతో దూషించారని కాకాణిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.
ఈ కేసులో గత ఏడాది ఆగస్టు 18న హైకోర్టులో ఆయనకు కండీషన్డ్ బెయిలు లభించింది. కాగా ఆ బెయిలు షరతుల మేరకు సాక్షులను ప్రభావితం చేయవద్దని, కేసుకు సంబంధించి మీడియాతో మాట్లాడొద్దని కాకాణికి కోర్టు విస్పష్ట ఆదేశాలు ఇచ్చింది. అయితే కాకాణి మాత్రం ఆ బెయిలు షరతులను ఉల్లంఘించి.. విలేకరుల సమావేశాలు నిర్వహించడం.. ఈ కేసులో సాక్షిగా ఉన్నతనతో సహా ఇతర సాక్షులను బెదిరిస్తున్నారని సోమిరెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో కాకాణి బెయిలు రద్దు చేయాలని కోరారు. ఈ పిటిషన్ సోమవారం (మార్చి 30) విచారించిన హైకోర్టు సమాధానం ఇవ్వాలని కాకాణిని ఆదేశిస్తూ ఆయనకు నోటీసులు జారీ చేసింది.






