గజదొంగ వికాస్ సింగ్ అరెస్టు.. అంతరాష్ట్ర దొంగల ముఠా గుట్టు రట్టు

posted on: Jun 4, 2026 12:57PM

వికారాబాద్ జిల్లాలో రాత్రి వేళల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ అంతరాష్ట్ర దొంగను పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసు బయటపడటంతో మొత్తం జిల్లాలో సంచలనం నెలకొంది. నిందితుడు వికాస్ సింగ్‌ను వికారాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకుని మీడియా ముందు ప్రవేశపెట్టారు. 

గత నెల 5న వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికంఠ నగర్‌లో జరిగిన చోరీ ఈ కేసుకు కీలక మలుపు అయ్యింది. రాత్రి సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు చొరబడి సుమారు ఒకటిన్నర తులాల బంగారం, అలాగే 2,10,000 రూపాయల నగదు అపహరించారు. ఉదయం ఇంటి యజమాని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రారంభంలో ఇది సాధారణ చోరీగా అనిపించినా, దర్యాప్తు సాగిన కొద్దీ ఇది అంతరాష్ట్ర దొంగల ముఠా పని అని తేలింది. పోలీసులు సమీప ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను క్షుణ్ణంగా పరిశీలించగా, అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని గుర్తించారు. అతనే కరడు గట్టిన నేరచరిత్ర కలిగిన వికాస్ సింగ్ అని నిర్ధారించారు.

తరువాత పోలీసులు టెక్నికల్ సర్వైలెన్స్ ఆధారంగా అతని కదలికలను ట్రాక్ చేసి రైల్వే స్టేషన్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన తర్వాత వికాస్ సింగ్‌ను గట్టిగా విచారించగా,  షాక్ ఇచ్చే విషయాలు బయట పడ్డాయి.  వికాస్ సింగ్ 16 ఏళ్ల వయస్సులోనే నేర ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. చిన్న చిన్న దొంగతనాలతో మొదలైన అతని క్రైమ్ జర్నీ తరువాత భారీ చోరీల వరకు వెళ్లింది. గతంలో సంగారెడ్డి, బొల్లారం ప్రాంతాల్లో మొత్తం 34 కేసుల్లో అతని పేరు నమోదై, జైలు శిక్ష కూడా అనుభవించినట్లు ఎస్పీ తెలిపారు.అయితే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మరింత పద్ధతిగా క్రైమ్ మోడల్‌ను రూపొందించినట్లు దర్యాప్తులో తేలింది. వికారాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పరిధిలో గత నెల 27 రాత్రి నుంచి వరుసగా ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. రాత్రి వేళల్లో మాత్రమే ఆపరేషన్ చేస్తూ, తాళం వేసి ఉన్న ఇళ్లనే ఎంచుకోవడం అతని ప్రత్యేకతగా గుర్తించారు.ఇంకా ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే, దొంగతనాల ద్వారా సంపాదించిన సొత్తును వికాస్ సింగ్ కేవలం ఖర్చు చేయడమే కాకుండా,  హెల్పింగ్ హ్యాండ్స్  పేరుతో ఒక ఎన్జీవోను ప్రారంభించినట్లు విచారణలో బయటపడింది. బయటకు సామాజిక సేవా సంస్థలా కనిపించినా, లోపల మాత్రం దొంగతనాల సొత్తు మళ్లించడానికి ఉపయోగించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక ఈ కేసులో మరో కీలక కోణం కూడా బయటపడింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన బంగారు నగల వ్యాపారులు శ్యామ్ మోసెస్, సూరజ్ మోహన్, అశోక్ సోనీ, వికాస్ అగ్రహారి వంటి వారు వికాస్ సింగ్‌ను దొంగతనాలకు ప్రోత్సహించడంతో పాటు అతనికి తుపాకీ కూడా సమకూర్చినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇది కేసును మరింత తీవ్రమైన అంతర్రాష్ట్ర క్రిమినల్ నెట్‌వర్క్ వైపు మళ్లించింది.పోలీసులు వికాస్ సింగ్ వద్ద నుంచి దొంగిలించిన బంగారంతో పాటు ఒక తుపాకీని కూడా స్వాధీనం చేసుకున్నారు. అతనికి సహకరించిన నెట్‌వర్క్ మొత్తం బయటకు తీసే దిశగా దర్యాప్తు కొనసాగుతోందని ఎస్పీ స్నేహ మెహ్రా స్పష్టం చేశారు. ఈ కేసు ఇప్పుడు కేవలం ఒక దొంగతనం కేసుగా కాకుండా, అంతరాష్ట్ర గ్యాంగ్ నెట్‌వర్క్ దిశగా దర్యాప్తు సాగుతోంది

google-ad-img
    Related Sigment News
    • Loading...