ఏపీలో చండ్ర నిప్పులు.. వడగాల్పులు

posted on: Apr 4, 2026 9:18AM

ఆంధ్రప్రదేశ్లో భానుడు చండ్రప్రచండుడిగా మారి తన ప్రతాపాన్ని చూపుతున్నాడు.  వేసవి ప్రారంభంలోనే  అంటే ఏప్రిల్ మొదటి వారంలోనే ఎండల తీవ్రత విపరీతంగా పెరగడంతో  జనం ఉక్కపోతతో, ఎండ వేడితో అల్లాడిపోతున్నారు. అసలే భానుడి ప్రతాపానికి విలవిల్లాడుతున్న ఏపీ జనాలకు వాతావరణ శాఖ మరో వార్నింగ్ ఇచ్చింది. నేటి నుంచి రోజుల పాటు రాష్ట్రంలో ఎండలు మరింత మండిపోతాయనీ, రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్లులు విస్తాయనీ ప్రకటించింది.  ముఖ్యంగా శనివారం (ఏప్రిల్ 4)  రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 73 మండలాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం రాష్ట్ర విపత్తుల సంస్థ పేర్కొంది.  ఉత్తర కోస్తా,  మన్యం జిల్లాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొంది.   విజయనగరంలో 24, శ్రీకాకుళంలో 16, పార్వతీపురం మన్యం జిల్లాలో 15 మండలాలలో వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుందని హెచ్చరించింది. అలాగే  పోలవరం పరిధిలో 9, అల్లూరి జిల్లాలో 3, కాకినాడలో 3, అనకాపల్లిలో 2, తూర్పుగోదావరి జిల్లాలో ఒక మండలంలో కూడా ఎండ తీవ్రత, వడగాల్పుల ప్రభావం సాధారణానికి మించి ఉంటుందని రాష్ట్ర విపత్తుల సంస్థ పేర్కొంది.

ఇక ఆదివారం ( ఏప్రిల్ 5)  పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని పేర్కొంది.  ఇకపోతే శుక్రవారం (ఏప్రిల్ 3)  పార్వతీపురం జిల్లాలోని భామినిలో అత్యధికంగా 41.8 డిగ్రీల సెల్సియస్ రికార్డయ్యింది. అలాగే.. చిత్తూరు జిల్లా రాయలపేటలో 41.4 డిగ్రీలు, అనకాపల్లి జిల్లా నాతవరంలో 40.9 డిగ్రీల  ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.   పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు కోరుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, చిన్న పిల్లల విషయంలో   జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...