బ్యాంకుకి వెళ్తే 150 కట్టాల్సిందే

posted on: Mar 2, 2017 1:33PM

 

పెద్ద నోట్ల రద్దు తరువాత ప్రైవేటు బ్యాంకుల పనితీరు మీద తీవ్ర దుమారం రేగింది. కమీషన్ల కోసం కక్కుర్తి పడి ప్రైవేటు బ్యాంకులు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించాయనీ, నల్లధనాన్ని కొత్త నోట్ల కిందకి మార్చుకునే అవకాశాన్ని కల్పించాయనీ విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి బ్యాంకులను చూసీచూడనట్లు వదిలేస్తూ, వారి అవసరాలకి తగినన్ని కొత్త నోట్లను అందిస్తూ రిజర్వ బ్యాంక్ కూడా అనుమానాస్పదంగా ప్రవర్తించిందన్నది బహిరంగ రహస్యం.

 

నోట్ల రద్దు నేపథ్యంలో అయినకాడికి డిపాజిట్లను దండుకున్న ప్రైవేటు బ్యాంకులు ఇప్పుడు దుడ్డుకర్రలను చేతపట్టాయి. నాలుగు సార్లకు మించి నగదు లావాదేవీలను కనుక నిర్వహిస్తే ప్రతి లావాదేవీకి కనీసం 150 రూపాయల రుసుము చెల్లించాలంటూ సర్క్యులర్లు జారీచేశాయి. నగదు లావాదేవీలని నిరుత్సాహపరిచేందుకే ఈ నిబంధన అని సదరు బ్యాంకులు పైకి చెప్పుకొంటున్నాయి. కానీ ఇది సామాన్యుల నోటి దగ్గర కూడు లాక్కొనే ప్రయత్నమే అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే ఈ 150 రూపాయల నిబంధనను శాలరీ ఖాతాల మీదే కాకుండా సేవింగ్స్ ఖాతాల మీద కూడా విధించారు. ఎక్కువగా దిగువ మధ్యతరగతి ప్రజలే ఈ సేవింగ్స్ ఖాతాలు కలిగి ఉంటారు. వారికి ఆనలైన్ లావాదేవీల మీద అంత పట్టు ఉండదు. కాబట్టి తమ నగదు లావాదేవీలను నిర్వహించాలంటే... దఫాకు 150 రూపాయల రుసుముని బ్యాంకుకి కట్టాల్సిందే! ఒక రకంగా చెప్పాలంటే మనం నిజాయితీగా దాచుకున్న సొమ్ముని వాడుకునేందుకు బ్యాంకుకి 150 రూపాయల లంచం ఇవ్వాలన్నమాట.

 

ఈ 150 రూపాయల నిబంధన ఇంతకుముందు ICICI బ్యాంకుకి మాత్రమే ఉండేది. కానీ సందట్లో సడేమియాగా HDFC, AXIS వంటి బ్యాంకులు కూడా ఈ నిబంధనను నెత్తికెత్తుకుంటున్నాయి. కేవలం లావాదేవీల మీదే కాదు... మన ఖాతాలో ఇతరులు జమ చేసే సొమ్ము మీదా, సొంత బ్రాంచ్ కాకుండా ఇతర బ్రాంచ్లో జరిపే లావాదేవీల మీద కూడా ఈ బ్యాంకులు అనేక నిబంధనలను రుద్దాయి. మరికొన్ని రోజులు పోతే ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా ఇదే బాట పట్టే అవకాశం ఉందని ఊహిస్తున్నారు.

 

నల్లధనాన్ని రూపుమాపుతామనీ, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తామని ప్రభుత్వం తెగ ఊదరగొడుతోంది. ఆ ఆశయాలను సావకాశంగా తీసుకున్న ప్రైవేటుబ్యాంకులు... పేదల కడుపు కొట్టైనా సరే, తమ ఖజానాను నింపుకోవాలని చూస్తున్నాయి. మరి మోదీగారు ఇదంగా గమనిస్తున్నారో లేదో!

- నిర్జర.

google-ad-img
    Related Sigment News
    • Loading...